Showing posts with label కథలు-అనుభవాలు. Show all posts
Showing posts with label కథలు-అనుభవాలు. Show all posts

Friday, April 26, 2013

ఆ హక్కు మీకు లేదు!-ముగింపు




సందీప్ చెప్పినదంతా విన్న సుభద్ర నిశ్చేష్టురాలయ్యింది.కొద్ది సేపు వరకు ఎలా స్పందించాలో తెలియక,మౌనంగా సందీప్ ని చూస్తు ఉండిపోయింది.సందీప్ అక్కడనుంచి లేచి వెళ్ళిపోయాడు.సుభద్ర వెంకట్ ని అడిగింది,"గీతతో మాట్లాడాలి"అని."నేను కూడా తనతో మాట్లాడలేదు ఇంతవరకు,వెళదాము పద"అని సమాధానమిచ్చాడు వెంకట్.ఇద్దరు కలిసి లివింగ్ రూం లో కి వెళ్ళి సురేష్ తో అన్నారు"మేము గీతను కలవాలి.మీ ఇంటికి వెళదామా"అని.సురేష్ అలాగేనని"పదండి"అన్నాడు.గీత నాన్నగారు కూడా వారితోటి కారులో కూర్చున్నారు.రాహుల్ తో చెప్పింది సుభద్ర" Please take care of Sandeep"అని.

సురేష్ ఇంటిలో గీత పరిస్థితి కూడా ఏమీ బాలేదు.రాత్రంతా నిద్ర లేమితో,బాగా ఏడ్చినట్టుగా  ఉంది మొఖం.గీతని చూస్తూనే అంది సుభద్ర "గీతా, ఏంటిదంతా?అసలు నువ్వేం చేసావో ఆవేశంలో తెలుసా?"అంటూ ప్రశ్నించింది.అక్కడే ఉన్న గీత అమ్మగారు,"మీ తమ్ముడు చేసిన నిర్వాకం మీకు తెలీదా?అమ్మాయిని ప్రశ్నించటానికి వచ్చారా?"అంటూ ఎదురు ప్రశ్న వేసారు"తమ్ముడితో మాట్లాడే వచ్చాను.జరిగినదంతా తెలుసుకున్నాను.ఎందుకు జరిగింది,ఎలా జరిగింది,ఎవరిది తప్పు అన్న విషయాలు చర్చించుకోవడం కన్నా,ఇప్పుడు మనం పెద్దవారిగా చెయ్యవలసినదేంటి వీరిద్దరిని కలపటానికి అన్న విషయం గురించి అలోచించాలండి."అని నెమ్మదిగా జవాబు ఇచ్చింది సుభద్ర.గీత నాన్నగారు కూడా వెంటనే"అమ్మాయి మీద చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది.ఇంత దూరం రాకుండా ఉండేది కదా"అని అన్నారు.వెంకట్ దురుసుగా"అంటే,చెయ్యి చేసుకున్నాడని కాప్స్ కి ఫోన్ చెయ్యమని చెప్పారా మీరు గీతకి"అంటూ గట్టిగానే అడిగాడు.మేమెందుకు చెపుతాము,ఆ పరిస్థితుల్లో మళ్ళీ కొడతాడేమో అని భయ్యంతో అమ్మాయి ఫోన్ చేసింది.తప్పేముంది అన్నట్లు పొగరుగా మాట్లాడాడు ఆయన.
 
సుభద్ర కళ్ళతోనే వెంకట్ ని వారించింది."గీతా,చెప్పమ్మా..నువ్వు చిన్న పిల్లవేమి కాదు.జరిగేది,జరుగుతున్నది నీకు అర్ధం కాకపోవడానికి.సందీప్ దుర్మార్గుడు,అతనితో బ్రతకడమంటే నా ప్రాణానికి హాని అని నువ్వు అనుకున్నట్లైతే చెప్పు.తమ్ముడిగా నా దృష్టిలో అతను మంచివాడే కావొచ్చు,భర్తగా మంచివాడవ్వాలని లేదుగా"అంటూ సూటిగా గీతని చూస్తూ అడిగింది. గీత దగ్గర నుంచి సమాధానం రాలేదు.చాలా సేపు గీతతో మాట్లాడుతూనే ఉంది సుభద్ర.అవేశంలో,తొందరపడి ఇద్దరు చేసినవి తప్పులే!భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వారు ఎలాంటి సమస్య వచ్చినా ఇంకోరకంగా పరిష్కరించుకునేవారేమో కాని,గీత తల్లితండ్రులు అక్కడ ఉండటం వలన ఇద్దరు ఎవరికి వారు తగ్గడానికి అహాలు అడ్డు వచ్చి,ఇంత దూరం తెచ్చుకున్నారు.ఎంత సేపు మాట్లాడినా రాయిలా కూర్చుందే తప్ప,గీత ఒక్క మాట కూడా సుభద్రతో మాట్లాడలేదు.ఇక తను చెయ్యగలిగినది ఏమీ లేదు అనుకుంటూ,అవేశాలు తగ్గాక,వివేకం హెచ్చరిస్తే,అప్పుడు కాని వారి బుర్రలు సరిగ్గా పని చెయ్యవని అనుకుని,వెళతానని చెప్పి బయలుదేరింది సుభద్ర.సందీప్ ఇంటికి వచ్చి,సందీప్ బట్టలు సర్దమని రాహుల్ కి చెప్పి,సందీప్ ని తనతో పాటు ఇంటికి రమ్మని అడిగింది.  "లేదక్కా, నేను రాను.I need some time for myself"అని సందీప్ సుభద్రతో చెప్పాడు.రాహుల్ ని తోడు గా ఉండమని చెప్పి అక్కడనుంచి ఇంటిముఖం పట్టింది సుభద్ర.

జరిగినదంతా ఒక కల అయితే ఎంత బాగున్నో! అని లెక్కలేనన్ని సార్లు అనుకుంది సుభద్ర.వెంకట్ మాత్రం గీతదే తప్పని,కాప్స్ కి ఫోన్ చేసే ముందు ఒక్క క్షణం అలోచించి ఉంటే సమస్య ఇంత జటిలంగా మారేది కాదు కదా అని బాధపడ్డాడు.సుభద్ర మాత్రం తప్పు ఎవరిది అన్న విశ్లేషణ అనవసరమని,ఎలాగైనా వారిద్దరు జరిగినదంతా మరచిపోయి,మళ్ళీ కలిసిపోవాలని దేవున్ని మనసులో కోరుకుంది.గీత కొద్ది రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి సురేష్ ఇంట్లోనే తల్లితండ్రులతో కలిసి ఉండిపోయింది.సందీప్ ని చాలా సార్లు ఇంటికి రమ్మని అడిగి విసిగిపోయిన సుభద్ర తనే రోజు విడిచి రోజు అతనిని కలిసి వచ్చేది.గీతతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది.సందీప్ సహజంగానే మితభాషి.ఈ సంఘటనతో అతను మనుషులతో మాట్లాడం పూర్తిగా తగ్గించేసాడు.అతని మనుసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మ రుద్రాదులకు అయినా సాధ్యం అయ్యే పనేనా అనుకుంటూ ఉండేది సుభద్ర. 

ఎలాగైనా సందీప్ ని,గీతని ఒక చోట చేర్చి వారిని ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చెయ్యాలని ఎన్నోసార్లు అనుకుంది సుభద్ర.గీత మాట ఎత్తితేనే,పూర్తిగా మౌనం వహించేవాడు సందీప్.సందీప్..బుజ్జిగాడిని చూడాలని అనిపించటం లేదా అని సందీప్ ని నిలదీసి అడిగితే మాత్రం చాలా బాధపడేవాడు.బుజ్జిగాడి కోసం అయినా వీళ్ళిద్దరు కలిసిపోతారేమో అన్న ఆశ కలిగేది సుభద్రకి.సందీప్ తల్లితండ్రులు,పెద్దవాళ్ళు అందరు గీతతో,గీత తల్లితండ్రులతో మాట్లాడారు.సందీప్ వచ్చి తనతో మాట్లాడితే తిరిగి సందీప్ తో కలిసి జీవితం గడపడానికి తనకేమి అభ్యంతరం లేదని గీత చెప్పింది.అది వినగానే అందరు చాలా ఆనందపడి సందీప్ ని ఒక్కసారి దీపని కలవమని ఎంతో నచ్చచెప్పారు.ససేమిరా అన్నాడు సందీప్.ఆ విషయం తెలిసిన దీప తనకేమి సందీప్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదంటూ,బుజ్జిగాడిని తల్లితండ్రులతో ఇండియా పంపించి తను ఉద్యోగం చేసే స్టేట్ లోనే ఇల్లు రెంట్ చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.ఒక సంవత్సర కాలంలో సందీప్ రెసిడెన్సి పూర్తిచేసుకుని,వేరే స్టేట్ లో తన మిత్రులతో కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి,కొద్ది కాలంలోనే బిసి అయిపోయాడు.వెకషన్ కి ఇండియా వెళ్ళిన సుభద్ర బుజ్జిగాడిని చూడడానికి వెళ్ళింది.ఎంతో ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు.వాడు చేసే అల్లరి ఎలా  ఉంటుందో చెప్పి మురిసిపోయారు గీత తల్లితండ్రులు.సుభద్రకి మనసులో ఎంతో దిగులుగా అనిపించింది.బుజ్జిగాడికి తల్లితండ్రులిద్దరి ప్రేమను పొందే అదృష్టం లేదే అని.ఇండియా నుంచి తిరిగి వచ్చాక సందీప్ ని కలిసింది సుభద్ర.తన కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో,తను లైఫ్ లో ఏమీ మిస్స్ అవుతున్నాడో తెలుసుకోమని మళ్ళీ చెప్పింది సుభద్ర.సందీప్ వైఖరిలో ఏమీ మార్పు లేదు.

అప్పటివరకు ఎవ్వరిని జరిగిన దానికి దూషించని సుభద్ర మాత్రం ఆ రోజు తమ్ముడిని పట్టుకుని కడిగేసింది.పెద్ద పెద్ద చదువులు,ఉన్నతమైన పదవులు,ఆత్మాభిమానాలు అనుకుంటూ అన్ని భూతద్దంలో చూసుకుంటున్నారే కాని,మీకు ఒక కొడుకు ఉన్నాడని కాని,వాడు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమకు దూరమౌతున్నాడని అలోచించారా?పిల్లలు ఉన్నారని జీవితమంతా రాజిపడి బ్రతకడం మా వల్ల కాదు అని మోడర్న్ గా అలోచిస్తూ,పాత కాలం చింతపండులా కాదు అని విర్రవీగుతున్నారే కాని,కలిసి బ్రతకలేనప్పుడు, అంత తొందరపడి పిల్లలను ఎందుకు కనాలి అని మాత్రం అలోచించరే?నాకు తెలిసిన సూత్రం ఒక్కటే సందీప్.నీకు, గీతకి బుజ్జిగాడు ఉండకపోతే,మీ ఇద్దరి జీవితాలు మీ ఇష్టం.చెయ్యి చేసుకుంటే పడి ఉండే భార్య లేదని నువ్వు,అవేశం లో చెయ్యి చేసుకున్నాడని మతి లేకుండా కాప్స్ వరకు వెళ్ళిన నీ భార్య ఇద్దరు ఇద్దరే!పూర్తి స్వార్ధపరులు.ఆ రోజు ఇద్దరు అలసి సొలసి ఇంటికి చేరి ఉండకపోతే,మీ అత్తగారు,మావగారు ఇంట్లో ఉండకపోతే ఆ సంఘటన జరిగేదే కాదు.మూడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడుతూ కూడా,ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉన్నవారు,ఆ ఒక్క రోజు సంఘటనతో విడిపోయారు.పిల్లలని కనేముందు ఒక్కసారి అలోచించండి మీ యువతరం.ఒకరికొకరు జీవితాంతం తోడు ఉండగలమనే ఆ నమ్మకం కలగనప్పుడు దయచేసి పిల్లలను కనకండి.ఒకసారి పిల్లలను కన్నాక,పంతాలకు పోకండి.ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి.అన్ని విషయలలో ఒకటి పది సార్లు అలోచిస్తారు కదా మీ తరం,దయచేసి పిల్లలను కనడం ఒక experience గా పరిగణించకుండా అది ఒక బాధ్యత అని వారి బంగారు జీవితం మీ చేతిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించండి.అలా అని మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అని నేను అనడం లేదు.ఒకవేళ నిజంగానే మొదట్లో బయటకి రాని విశ్వరూపాలు పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాల తరువాత బయటపడితే,అప్పుడు కలిసి ఉండాలి అని నేను అనను.కాని మీ స్వార్ధానికి, మీ అర్ధంలేని అహాలకి పిల్లల జీవితాలను బలి ఇవ్వకండి.కలిసి బ్రతకలేనప్పుడు మీకు పిల్లలను కనే హక్కు లేదు."అని తమ్ముడి తో తెగేసి చెప్పింది సుభద్ర.  

Thursday, April 25, 2013

ఆ హక్కు మీకు లేదు!




అర్ధరాత్రి ఒంటిగంట దాటింది.గాడనిద్రలో ఉన్నారు వెంకట్,సుభద్ర.సెల్ ఫోన్ మోగడంతో ఉల్లిక్కిపడి లేచాడు వెంకట్.ఎందుకో వేళ కాని వేళ ఫోన్ వస్తే,అతనికి చాలా కంగారుగా ఉంటుంది.ఇండియాలో అందరు క్షేమంగా ఉన్నారో,లేదో అని  గాబరా పడుతు ఉంటాడు.సెల్ నంబర్ చూస్తే లోకల్ నంబరే!ఎవరో ఇంత రాత్రి వేళ ఫోన్ చేసింది అనుకుంటూ,"హెల్లో.."అన్నాడు.ఇంతలో సుభద్ర లేచి,"ఎవరు వెంకట్?ఇంత రాత్రి వేళ?"అని అడిగింది.మాట్లాడదన్నట్ట్లు సైగ చేస్తూ,వెంటనే తను బయలుదేరి వస్తున్నానని,ఫోన్ చేసిన వారితో చెప్పి ఫోన్ పెట్టేసాడు వెంకట్.విషయం అర్ధం కాక సుభద్ర ఆందోళనగా చూసింది భర్త వంక."ఎక్కడికి ఇంత రాత్రి వేళ? Is everything alright?"అని అడిగింది."నేను అర్జెంట్ గా వెళ్ళాలి.ఫోన్ చేస్తాను నీకు ఒక అరగంటలో,భయపడకు,కంగారు పడాల్సినది ఏమీ లేదులే"అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు వెంకట్.విషయం ఏమై ఉంటుందా అని అలోచిస్తూ,పడుకున్న సుభద్రకి కొంచెంసేపటికే నిద్ర పట్టేసింది.ఉదయం నిద్ర లేచేటప్పటికి సమయం ఏడు దాటింది.ఆ రోజు శనివారం అన్న విషయం గుర్తు వచ్చి,మళ్ళీ బద్దకంతో కళ్ళు మూసుకుంది.

అంతలో రాత్రి ఫోన్ రావడం,వెంకట్ హడావిడిగా బయటికి వెళ్ళడం అన్ని గుర్తొచ్చాయి.అప్పుడు మొదలయ్యింది సుభద్రలో కంగారు.తనకి భర్త ఫోన్ చెయ్యలేదన్న విషయం గ్రహించి,వెంకట్ కి  కాల్ చేసింది సుభద్ర.వెంకట్ ఫోన్ ఎత్తగానే,కొంచెం కోపంగా"ఏమయిపోయావు,రాత్రి హట్టాత్తుగా వెళ్ళిపోయావు,ఫోన్ కూడా చెయ్యలేదు.ఎక్కడ ఉన్నావు ఇప్పుడు?"అని అడిగింది.వెంకట్ నెమ్మదిగా చెప్పాడు,నువ్వు కాలకృత్యాలు తీర్చుకుని సందీప్ ఇంటికి రా,తరువాత మాట్లాడుకుందాము"అన్నాడు వెంకట్.ఆశ్చర్యపోయింది సుభద్ర."అదేంటి, సందీప్ ఇంటికా ఎందుకు? బుజ్జిగాడు బాగున్నాడా?ఏమయ్యింది వెంకట్?"అని కంగారుగా అడిగింది సుభద్ర.నువ్వు వీలైనంత తొందరలో వచ్చెయ్యి,ఫోన్ లో నేను ఏమి చెప్పలేను"అని ఫోన్ పెట్టేసాడు వెంకట్.

ఒక్కసారిగా దిగాలు పడిపోయింది సుభద్ర.సందీప్ సుభద్ర పిన్ని కొడుకు.వయస్సులో చాలా తేడా ఉన్నపటికి,వారిద్దరి మధ్య చనువెక్కువ.తమ్ముడంటే ప్రాణం సుభద్రకి.వెంకట్ కూడా సందీప్ అంటే చాలా అభిమానంగా ఉంటాడు.సందీప్ కి పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలయ్యింది.ఇండియాలో మెడిసిన్ చేసి ఇక్కడ రెసిడెన్సి ఆఖరి సంవత్సరం చేస్తున్నాడు.అతని భార్య గీత పక్కనే ఉన్న ఇంకో స్టేట్ లో ఉద్యోగం చేస్తుంది.మూడు నెలెల బుజ్జిగాడు వారి తొలి సంతానం.ప్రతి వీకెండ్ తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళి వాడిని ముద్దాడడం సుభద్రకి,వెంకట్ కి మామూలే!బుజ్జిగాడికేమన్నా ఒంట్లో బాగోలేదా?నేను కంగారు పడతానని నాకు చెప్పలేదా?ఇండియా నుంచి వచ్చిన గీత తల్లితండ్రులకు ఆరోగ్యం బానే ఉంది కదా..అని ఇలా రక రకాల అలోచనలతో హడావిడిగా స్నానం చేసి,సందీప్ ఇంటికి బయలుదేరింది సుభద్ర.

సందీప్ ఇంటి దగ్గర నాలుగు కార్లు వరకు కనిపించడంతో కంగారు ఇంకా ఎక్కువయ్యింది సుభద్రకి.సందీప్ ఇంట్లోకి అడుగుపెడుతూనే లివింగ్ రూంలో కూర్చుని ఉన్న గీత నాన్నగారిని,వెంకట్ ని,గీత పెదన్నాన్న కొడుకు సురేష్ ని,సందీప్ ప్రాణస్నేహితుడైన రాహుల్ ని చూసింది సుభద్ర.అంతమందిని అక్కడ చూసిన సుభద్రకి ఎందుకో బుజ్జిగాడికి ఏమన్నా అయ్యిందేమో అన్న అందోళన కలిగింది.అక్కడ వారందరి మధ్య సందీప్ లేకపోవడం గమనించి,భర్త వంక బేల గా చూసింది సుభద్ర.లోపలికి పదమంటూ సైగ చేసి,వెనకనే తను వచ్చాడు వెంకట్."సందీప్ ఏడి?బుజ్జిగాడు బాగున్నాడా?గీత ఎక్కడ?"అని ప్రశ్నల వర్షం కురిపించింది సుభద్ర.పై ఫ్లోర్ లో ఉన్న బెడ్రూం లొకి తీసుకెళ్ళాడు సుభద్రని వెంకట్.అక్కడ సందీప్ ఒక్కడే బెడ్ మీద పడుకుని ఉన్నాడు.అలికిడి వినిపించి కళ్ళు తెరిచి చూసాడు.సందీప్ కళ్ళు ఎర్రగా చూడడానికే భయపడేట్టు  ఉన్నాయి.సుభద్రని చూడగానే,కళ్ళలో నీళ్ళు తిరిగి,అవి కనపడతాయేమో అన్నట్టు,కళ్ళు వెంటనే మూసుకుని బెడ్ మీద ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు.

వెంకట్ అక్కడ ఉన్న కుర్చిలో కూర్చుని నెమ్మదిగా సుభద్రతో అన్నాడు,"రాత్రి సందీప్ ని కాప్స్ అర్రెస్ట్ చేసారు.మూడు గంటల క్రితమే ఇంటికి తీసుకొచ్చాము"అని."ఎందుకు?సందీప్ ఏమయ్యిందిరా? ఇటు చూడు"అంటూ తమ్ముడి భుజం పట్టుకుని కుదిపేసింది సుభద్ర.సందీప్ నుండి సమాధానం ఏమీ రాలేదు.వెంకట చెప్పసాగాడు."రాత్రి గీత మీద చెయ్యి చేసుకున్నాడు.గీత కాప్స్ కి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చితీసుకెళ్ళారు" అని.హతాశురాలయ్యింది సుభద్ర.అసలు చెయ్యి చేసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది వీడికి?గీత కాప్స్ ని ఎందుకు కాల్ చేసింది?ఏది గీత?గీతా,గీత అని గట్టిగా పిలవసాగింది సుభద్ర."గీత ఇక్కడ లేదు,వాళ్ళ అమ్మ,బుజ్జిగాడు అందరు సురేష్ ఇంట్లో ఉన్నారు."అని సమాధానమిచ్చాడు వెంకట్.అప్పటికే సుభద్రకి జరగరానిదేదో వారిద్దరి మధ్య జరిగిందని,దాని పర్యవసానం కూడా చాలా త్రీవ్రంగా ఉంటుందని అర్ధం అయిపోయింది."ఏమి జరిగిందో గీత వాళ్ళ నాన్నగారు చెప్పటమే కాని వీడు మాత్రం ఎంత అడిగినా నోరు మెదపటం లేదు.నువ్వు మాట్లాడు"అని ఆ రూం లోంచి బయటికి వెళ్ళిపోయాడు వెంకట్.


సుభద్రకి అప్పటికే కాళ్ళు,చేతులు వణకసాగాయి.నెమ్మదిగా తమ్ముడి పక్కన  కూర్చుకుని అడిగింది. అసలు ఏం జరిగిందిరా సందీప్,చెప్పు.మీ ఇద్దరి మధ్య గొడవలేంటి?నాకసలు ఏమీ అర్ధం కావట్లేదు."సందీప్ ఏమీ మాట్లాడలేదు. "సందీప్ అలా కాదు, నా మాట విను. జరిగిన విషయం మాకు ఎలా తెలిసేది, నువ్వు ఇలా మౌనంగా ఉంటూ,నీలో నువ్వు బాధపడితే?దయచేసి చెప్పరా" అని బతిమాలింది సుభద్ర.వెంకట్ కాఫీ కప్పు తో రూం లో కి వచ్చి, సుభద్ర చేతికి ఇచ్చాడు, సందీప్ కి ఇవ్వమని సైగ చేస్తూ.అప్పటికి చలనం లేకుండా ఉన్న సందీప్ ని చూస్తే,సుభద్రకి ఒక్కసారిగా కోపం వచ్చి, కొద్దిగా గట్టిగానే, ఇదిగొ నువ్వు ముందు ఆ మంచం మీద నుంచి లెగు, వాష్ రూం లోకి వెళ్ళి మొఖం కడుక్కుని రా.." అని తమ్ముడి మీద మండిపడింది.అయిష్టం గా లేచి, వాష్ రూం కి వెళ్ళి, కొద్దిసెపట్లో బయటికి వచ్చాడు సందీప్. కాఫీ కప్పు చేతిలో పెట్టి ముందు కాఫీ తాగు అంది సుభద్ర.తమ్ముడి మొఖంలోకి చూస్తూ, కంట తడి పెట్టుకుంది సుభద్ర. "ఏమిట్రా ఇదంతా? ఎలా అయిపోయావో తెలుసా? ఎలా జరిగింది ఇదంతా?" అని మళ్ళీ ప్రశ్నించింది. జరిగింది చెప్పసాగాడు సందీప్. 

గీత డెలివరీ కి గీత తల్లితండ్రులు ఇద్దరు,నాలుగు నెలల క్రితమే అమెరికా కి వచ్చారు.గీతకి బాబు పుట్టాక,రెండు నెలల తరువాత,తను ఉద్యోగంలో చేరాల్సిన రోజు రావడంతో అయిష్టంగానే కొడుకుని వదలలేకపోయినా,తప్పని సరి పరిస్థితులలో ఉద్యోగం లో జాయిన్ అయ్యింది.ఇంకో స్టేట్ లో ఉద్యోగం కాబట్టి, వీకెండ్ మాత్రమే ఇంటికి వచ్చేది. భర్త సందీప్ ని,తల్లితండ్రులను,బుజ్జిగాడిని అందరిని వదిలి ప్రతి సోమవారం జాబ్ కి వెళ్ళడానికి మనస్సు అంగీకరించకపోయినా,తప్పదు ఇంకో ఉద్యోగం దొరికేదాకా అనుకుంటూ వెళ్ళేది.సందీప్ రోజులో ఒక్కోసారి 15 గంటల వరకు పని చేసి ఇంటికి అలసి వచ్చేవాడు.కొడుకుతో సమయం గడపలేకపోతున్నానే అని బాధపడుతూనే,ఇంకెంతలే,కొద్దిరోజులే కదా,తను ప్రాక్టిస్ పెట్టుకునే వరకే కదా,అని సర్దిచెప్పుకునే వాడు.గీత తల్లితండ్రులు బుజ్జిగాడిని చాలా ఓపికగా పెంచేవారు.ఒకసారి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసరికి అత్తగారు,పంపులో వచ్చే నీరు బాటిల్ లో పోసి, పట్టించటం చూసిన సందీప్,అత్తగారితో అలా చెయ్యొద్దని, ఫిల్టర్ చేసిన నీళ్ళు కాని, కాచిన నీళ్ళు కాని ఇవ్వమని చెప్పాడు.సరే అంది గీత తల్లి.ఇంకో రెండు సార్లు కూడా అలా జరగడంతో, సందీప్ గట్టిగానే చెప్పాడు అత్తగారితో, దయచేసి ఆ నీళ్ళు పట్టకండి.వాడికేమన్నా చేస్తే,తరువాత హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే మాటలు కాదు అని.ఆవిడ అలాగేనని చెప్పింది.

ఆ తరువాత వీకెండ్, గీత అలసిపోయి శుక్రువారం రాత్రి 11:30 గంటలకు ఇంటికి చేరుకుంది.ఆ వారం బుజ్జిగాడికి ఒంట్లో కొద్దిగా నలతగా ఉండటంతో గీత అమ్మగారు,నాన్నగారు కూడా బాగా అలసిపోయి ఉన్నారు.ఆ రోజు కూడా తల్లి వచ్చేవరకు బుజ్జిగాడు నిద్రపోలేదు.అలసి సొలసి ఇంటికి చేరుకున్న గీత కొడుకుని దగ్గరకి తీసుకుని ముద్దాడ సాగింది.అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు సందీప్."ఎంత సేపయ్యింది వచ్చి" అని గీతతో మాట్లాడుతుండగానే,గీత అమ్మగారు పంపులో నీరు బాటిల్ లో పట్టి, బుజ్జిగాడికి పట్టసాగింది. అది చూసిన సందీప్ గట్టిగా అరిచినంత పని చేసాడు.'ఎన్ని సార్లు చెప్పానండి మీకు?పంపులో నీరు బాబుకి పట్టద్దని? చెపితే మీకు అర్ధం కాదా?" అని విస్సుకున్నాడు సందీప్ గీత తల్లిని.అల్లుడు అలా మాట్లడితే ఆవిడకు కూడా కోపం వచ్చి "మాకు తెలీదా పిల్లలను పెంచడం?" అని ఎదురు చెప్పింది. విస్తుపోయి ఆవిడ వంక చూస్తూ,మీకు చాలా సార్లు నెమ్మదిగా చెప్పాను, అలా చెయ్యొద్దని..మీకు నా మాట అంటే లక్ష్యం లేదు.అయినా మిమ్మల్ని అని ఏమీ లాభం?మా పిల్లలను మేము పెంచుకోకపోవడం మా దురదృష్టం"అనేసి విసురుగా,బాబుని ఆవిడ చేతిలోంచి లాక్కొని తన రూం లోకి వెళ్ళిపోయాడు సందీప్.గీత తల్లి అల్లుడు ఇంత అవమానం చేస్తాడా అంటూ,ఏడవసాగింది."ఎవ్వరి చేత ఒక్క మాట అనిపించుకోలేదు నేను,ఈ రోజు నీ గురించి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది"అని కూతురుని చూస్తూ, ఏడ్చింది ఆవిడ.తల్లి బాధపడుతుంటే, ఒక్కసారిగా గీతకు ఆవేశం వచ్చి సందీప్ దగ్గరికి వెళ్ళి బాబుని లాక్కుని, నీకసలు బుద్దుందా? పెద్దవాళ్ళతో మాట్లాడే పద్దతి అదేనా? మగవాడినన్న అహంకారం చూపిస్తున్నావా?అమ్మ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వయస్సులో బాబుని చూసుకుంటుంటే కృతజ్ఞతాభావం ఉండాల్సిన నీకు అది లేకుండా..మా అమ్మని విస్సుక్కుని కేకలు వేస్తావా అసలు నువ్వు మనిషివేనా?అంటూ కోపంతో ఊగిపోయింది.మాట,మాట పెరిగింది వారిద్దరి మధ్య.తల్లితండ్రులు వింటున్నారే అన్న తలంపు కూడా లేకుండా,ఆవేశం తో నోటికి వచ్చినట్లు మాట్లాడి,సందీప్ ని తిట్టసాగింది.బయటకి వచ్చి,మర్యాదగా తల్లికి క్షమాపణ చెప్పమని బెదిరించింది.అత్తగారు,మావయ్యగారి ముందు గీత తనని అలా నిలదీసి మాట్లాడడం సందీప్ కూడా సహించలేకపోయాడు.గీతని గదిలోంచి బయటికి నడవమని ఆదేశించాడు.వినలేదు గీత.గీత చెంప చెల్లుమనిపించాడు సందీప్.ఉక్రోషంతో చేతికి అందిన సరుకులన్ని సందీప్ మీద విసిరెయ్యసాగింది గీత."నన్ను కొడతావా"అని అవేశపడిపోతు.

ఇంతలో గీత తల్లితండ్రులు వచ్చి కల్పించుకుని తనని వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయారు.గీత తండ్రి కూడా ఆవేశం తో ఊగిపోతు అల్లుడిని తిట్టసాగాడు."ఎంత ధైర్యం రా నీకు?అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా కూతురుని,కష్టపడి చదువుకుంది,విదేశాలకి వచ్చింది.నీకంటే ఎందులో తక్కువ?దాని ఒంటి నీద చెయ్యి వేస్తావా నువ్వు" అంటూ పట్టరాని అవేశం తో ఊగిపోయాడు అతను.డోర్ లాక్ చేసుకుని తల పట్టుకుని కూర్చుండిపోయాడు సందీప్.ఒక అరగంటలో సందీప్ ఇంటికి కాప్స్(పోలిసులు) రావడం,గీతని కొట్టావా అని ప్రశ్నించి తమతో తీసుకెళ్ళిపోయారు.గీత 911 కాల్ చేసి తనపై పిర్యాదు చేసినట్టు అర్ధం అయ్యింది సందీప్ కి.
(ముగింపు తరువాయి టపాలో)

Tuesday, March 26, 2013

కోనసీమ-వేసవి సెలవులు-2

అన్నపూర్ణమ్మ గారి కంట్లో పడితే తమకి బడిత పూజ తప్పదని తెలిసిన ఆ అరుగురు గప్ చిప్ గా ఇంట్లోకి దూరి పడుకున్నట్లు నటించసాగారు.లక్ష్మి బయట పని ముగించుకుని ఇంట్లోకి వస్తూ పడుకున్నట్లు నటిస్తున్న శేఖర్ ని చూసి ముసి ముసి నవ్వులు నడుచుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది.

అన్నపూర్ణమ్మ గారికి ఒక్కగానొక్క కూతురు సత్యవతమ్మ.సత్యవతిని తన పిన్నమ్మ కొడుకు విశ్వనాధంకి ఇచ్చి పెళ్ళి చేసింది ఆవిడ.విశ్వనాధంకి,సత్యవతికి ఆరుగురు సంతానం.మొదటి సంతానం అబ్బాయి,మిగతా ఐదుగురు అమ్మాయిలే.విశ్వనాధంగారు ఊరిలో పేరున్న పెద్దమనిషి.నలభై ఎకరాల భూమికి ఆసామి కావడమే కాక,ఆ ఊరికి పంచాయితి ప్రెసిడంట్ కూడా.ఊరిలో ఎవరికి తగువులు వచ్చినా విశ్వనాధంగారి దగ్గరికే తీర్పు కోసం వచ్చేవారు.ముక్కు సూటి మనిషి,నిజాయితికి మారు పేరు ఆయన.ఊరిలో అందరికి అయనంటే ఎంతో గౌరవం.ఎప్పుడు వేసే విస్తరి,తీసే విస్తరి అని అన్నపూర్ణమ్మ ఎంతో విసుక్కుంటూ ఉండేది.సత్యవతి మాత్రం భర్త చెప్పినట్టు నడుచుకునేది.విశ్వనాధంగారికి కొబ్బరి తోటలు ఉండేవి.ఏటా కొబ్బరి దిగుబడి బాగా వచ్చేది.చెరుకు పండించి బెల్లం తయ్యారు చేసి అమ్మేవారు.ఊడ్పు భూమిలో ధాన్యం పండించేవారు.వీటన్నిటితో పాటు సిగరెట్టు కూడా తెగ కాల్చేస్తూ,రాత్రైయితే కొద్దిగా పుచ్చుకోవటం లాంటి వ్యసనాలు కూడా ఆయనకి ఉండేవి.

విశ్వనాధంగారు కాంగ్రెస్స్ వాది.ఆ ఊరిలో,జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.ఒక్కగానొక్క కొడుకు మాత్రం విధ్యార్ధి దశలోనే కమ్యునిస్ట్ పార్టి సిద్ధాంతాలకు ఆకర్షింపబడి కమ్యునిస్ట్ పార్టిలో సభ్యత్వం తీసుకున్నాడు.విషయం తెలిసిన తరువాత విశ్వనాధంగారి కోపానికి గురైనా తను మాత్రం నమ్మిన సిద్ధంతాలను,పార్టీను వదలలేదు ఆయన కొడుకు.కొడుకుతో పాటు ఐదుగురు కూతుర్లు కూడా నెమ్మదిగా అన్నగారి బాటలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనే ఇష్టపడేవారు.ఐదుగురు కూతుర్లకు పెళ్ళిల్లు చేసి గోదావరి జిల్లా అల్లుల్లనే తెచ్చుకున్నారు విశ్వనాధం గారు.కొడుకు ఆదర్శ వివాహం,కానీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుని తండ్రితో పాటు వ్యవసాయం చేసుకుంటూ అదే ఊరిలో తల్లితండ్రి,అమ్మమ్మతో నివసించేవాడు.

విశ్వనాధంగారి కొడుకు సంతానమే వంశీ.శేఖర్,రూప,రమ్య,రవి,గోపాల్ విశ్వనాధంగారి ఐదుగురు అమ్మాయిల సంతానం.వీరందరు ప్రతి వేసవి సెలవలకు కలుసుకుంటారు.కలుసుకున్న ఆ రెండు నెలలలో వారి అల్లరికి అంతు ఉండేది కాదు.విశ్వనాధంగారికి,సత్యవతిగారికి మనవలంటే ప్రాణం.వారు ఆడింది ఆట,పాడింది పాటగా గడిచేది ఆ రెండు నెలలు.అన్నపూర్ణమ్మ మాత్రం ఎప్పుడు విస్సుకుంటూ,వారి అల్లరి మితి మీరినప్పుడల్లా వారి మీద చెయ్యి చేసుకోడానికి కూడా వెనకాడేది కాదు.అందుకే ఆ ఆరుగురికి అన్నపూర్ణమ్మగారంటే  గారంటే మాత్రం చాలా భయ్యం.

పదమూడేళ్ళ లక్ష్మి తల్లీతండ్రి ఆ ఊరిలో మగ్గాల మీద వస్త్రాలను నేసేవారు.చేదోడు వాదోడు గా ఉంటుందని అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో పనికి పంపించేవారు.దాదాపు అదే వయస్సు ఉన్నవారు ఆ ఇంటి మనవలందరు.అందుకే వారందరితో కలిసి ఎన్నో ఆటాలు ఆడేది లక్ష్మి.తెల్లవారుఝామునే వచ్చి అన్ని పనులు చక్కబెట్టే లక్ష్మిని చూస్తే ఆ ఆరుగురికి చాలా ఆశ్చర్యంగా ఉండేది.ఒక్క రోజైనా తాము లక్ష్మి కంటే ముందుగా లేచి లక్ష్మి కోసం వీధి అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తామని పందెం కట్టారు ఆ ఆరుగురు.పందెం ఆరుసార్లు ఓడిపోయారు.పందెం గెలిసినప్పుడల్లా వారు ప్రతి వారం పొలం వెళ్ళి తాగే ముంజి కాయ నీరు తనకే ఇచ్చెయాలనేది  లక్ష్మి.

"బారెడు పొద్దెక్కింది.ఇంక లెగుస్తారా"అంటూ అన్నపూర్ణమ్మ అందరిని తట్టిలేపింది.అందరు లేచి కాలకృత్యాలు తీర్చుకుని,ఇంట్లో చావిడి దగ్గర సమావేశం అయ్యారు.ఆ గ్రూప్ కి లీడర్ శేఖర్,వంశీలు.వారు చెప్పినట్టు మిగతావారందరు నడుచుకునే వారు."లక్ష్మి మీద పందెం మనం ఇంకెప్పుడు గెలవలేమా అన్నయ్యా"అని అడిగింది రూప.అలోచిస్తున్న శేఖర్ "నాకొక అద్భుతమైన ఇడియా వచ్చింది"అంటూ...బావ వంశీ చెవిలో ఏదో గుసగుస లాడాడు.వింటూనే వంశీ ఆనందంతో చిన్నగా విస్సిల్ వేసాడు.విషయం తమకి కూడా చెప్పమని మిగతావారందరు గొడవ చేసారు.వారందరికి నెమ్మదిగా లోగొంతులో వంశీ చెప్పసాగాడు ఆ రాత్రి తాము ఏమి చెయ్యదలచారో...

Thursday, March 21, 2013

కోనసీమ-వేసవి సెలవులు-1



సమయం రాత్రి ఒంటిగంట దాటింది.అమావస్య కావటం వలన,చిక్కటి చీకటి ఆ అరుగు అంతా వ్యాపించి ఉంది.ఆరుబయట అరుగు మీద ఆరు మంచాల మీద ఆ ఆరుగురు వళ్ళు మరచి హాయిగా నిదురపోతున్నారు.ఇంతలో ఆ వీధిలో కుక్క ఒకటి బాధగా మొరిగింది.పక్కనే ఉన్న మిగతా కుక్కలు కూడా "భౌ""భౌ"మంటూ మొరగసాగాయి.గదిలో పడుకున్న అన్నపూర్ణమ్మకి నిద్రాభంగం కలిగింది.ఇలా కునుకు పట్టిందో లేదో,ఇంతలోనే వెధవ గొడవ అని విసుక్కుంటూ,ఆ చీకట్లో తడుముకుంటూ నడచి వెళ్ళింది.వీధి గుమ్మం తలుపు తీసి,కర్ర ఒకటి తీసుకుని కుక్కలన్నింటిని గట్టిగా బెదిరించింది.కుక్కలు ఆ వీధి దాటి పారిపోయాయి.అన్నపూర్ణమ్మ అరుగు దాటి తన గదిలోకి వెళ్ళి,తలుపు దగ్గరగా వేసి పడుకుంది.

అదే సమయంలో అరుగు మీద పడుకున్న ఆరుగురిలో ఒకరైన వంశీకి చట్టుకున్న మెలకువ వచ్చింది.ఎవరో తన భుజం మీద చెయ్యి వేసి లేపినట్టుగా అనిపించింది.వంశీ వయసు పదకొండు సంవత్సరాలు.అర్ధరాత్రి ఉల్లిక్కిపడి లేవడం వలన,అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.కళ్ళు పోడుచుకున్నా కనపడని చీకటిలో వంశీకి తన పక్కన పడుకున్న వారెవ్వరు కనపడలేదు.పక్కన కప్పుకోకుండా మడత పెట్టి ఉన్న దుప్పటి లాక్కొని మొఖ్ఖం మీదగా పూర్తిగా కప్పేసుకుని,భయ్యంతో వణికిపోతున్నాడు.అరగంట గడిచాక నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు వంశీ.
 
"లెగు తొందరగా,లక్ష్మి వచ్చేస్తుంది.వినిపిస్తుందా?"అని తనని పట్టుకుని కుదిపేస్తున్న బావ శేఖర్ ని  చూసి,ఒక్క ఉదుటున మంచం మీద నుంచి కిందకు దూకాడు వంశీ.అప్పటికే శేఖర్,రవి,రమ్య,రూప,గోపాల్ అందరు లేచి తన మంచం చుట్టూ గుముకూడి ఉండటం చూసాడు వంశీ.అక్కడ ఉన్న అందరి వయసు 10-12లోపే ఉంటుంది.వారందరూ సెలవలకి పట్టణాల నుంచి అమ్మమ్మ,తాతయ్య నివసిస్తున్న కోనసీమలో ఒక పల్లెటూరికి వచ్చారు.వారి అల్లరికి అంతు లేదని మామ్మగారు అన్నపూర్ణమ్మ విసుక్కుంటుంటే,ఆవిడ కూతురు సత్యవతమ్మ నా మనవలకేంటి బంగారం అని మురిసిపోతూ ఉంటుంది.
 
చుట్టూ ఇంకా కొద్దిగా చీకటిగా ఉండడం చూసి "టైమెంత"అని అడిగాడు వంశీ బావ శేఖర్ ని."ఐదు గంటలు దాటింది.లెగు,ఈ రోజైనా మనం పందెం ఓడిపోకూడదు"అన్నాడు శేఖర్.అయినా ఇప్పటికే లక్ష్మి వచ్చేసిందో ఏమో?రూపా, బయట కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఉందేమో చూడు"అని ఆర్డర్ జారి చేసాడు శేఖర్."అలాగే ఉండు చూసేసి వస్తా"అని రెండు అడుగులు గుమ్మం వైపు వేసి,ఆగిపోయింది రూప."అమ్మో!ఈ చీకట్లో ఒక్కదాన్నే నేను వెళ్ళలేను.రమ్య,నువ్వు కూడా రా"అని చెల్లెలి చెయ్యి పట్టుకుంది రూప."వద్దు అందరం కలిసే వెళదాము"అని రూప బెరుకుగా అన్న రవి వైపు చూసింది."అంత పిరికితనం ఏంటీ అసలు మీ అందరికీ?సరే పదండి"అని శేఖర్ ముందు నడవగా మిగతా ఐదుగురు అడుగులో అడుగు వేస్తూ అతనిని అనుసరించారు. 
 
అప్పటికే అన్నపూర్ణమ్మ లేచి వంటగదిలో మజ్జిగ చిలకరిస్తుంది.మామ్మగారు చూస్తే ఎక్కడ తమ మీద విరుచుకుపడతారో అని ఆ అరుగురు శబ్ధం చెయ్యకుండా వీధిలోకి వెళ్ళారు.అక్కడ ముంగిట ముగ్గు లేదు.ఆనందంతో అందరు పొంగిపోయారు.మొత్తానికి ఇన్ని రోజులకి లక్ష్మి మా చేతిలో ఓడిపోయింది అనుకుని ఒకరినొకరు కౌగిలించుకుని,"భలే"అని సంతోషంతో ఉప్పొంగిపోతుండగా ఇంట్లోంచి బక్కెట్టు,చీపిరి కట్ట తీసుకుని లక్ష్మి బయటికి అడుగుపెట్టింది.లక్ష్మిని చూడగానే అందరి మొఖ్ఖాలు మాడిపోయాయి."నువ్వెప్ప్పుడొచ్చావు?"నోరు తెరుచుని లక్ష్మిని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.ఫక్కున నవ్వింది లక్ష్మి."ఎప్పుడా?కోడి మొదటి సారి కూసినప్పుడు"అని కొంటెగా జవాబు చెప్పింది.ఇది అరోసారి మీరందరు నాతో ఓడిపోవడం"అని అంది.ఇంతలో అన్నపూర్ణమ్మ గట్టిగా అరిచింది వంటగదిలోంచి"ఎవరితోనే లక్ష్మి,పొద్దునే ఆ ముచ్చట్లు నీకు?"."వద్దు వద్దు చెప్పొద్దు"అని బతిమాలసాగారు ఆ అరుగురు."ఎవరితోను లేదమ్మా",అని కల్లాపు వెయ్యడంలో నిమగ్నమైపోయింది లక్ష్మి.

Thursday, December 6, 2012

తస్మాత్ జాగ్రత్త


"సత్యా..దీపక్ ఇండియా నుంచి వచ్చాడు.ఈ రోజు ఉదయమే పలకరించాను" అంటూ వార్త మోసుకొచ్చింది వాణి. "అవునా?ఉండు వెళ్ళి కలిసి వస్తాను" అంటూ దీపక్ కూర్చునే డిపార్ట్ మెంట్ వైపు అడుగులు వేసింది సత్య. తల వంచుకుని, తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నాడు దీపక్. నెల రోజుల తరువాత వర్క్ కి ఆ రోజే రావడం కారణంగా చదవని ఇమైల్స్ అన్నీ చూస్తున్నాడు దీపక్. దీపక్ ని చూడగానే "హాయ్ దీపక్,నీ ట్రిప్ ఎలా అయ్యింది?" అని అడిగింది సత్య. సత్యని చూస్తూనే చిరునవ్వు పెదవులపై తల్లుక్కుమంది దీపక్ కి."అక్కా..అంతా బాగా జరిగింది" కొంచెం సిగ్గుపడుతూ జవాబు ఇచ్చాడు. "ఓహో ! కొత్త పెళ్ళికొడుకు సిగ్గు కూడా పడుతున్నాడండి" అని దీపక్ ని ఆట పట్టించింది సత్య. "ఇంతకీ అనురాధని తీసుకుని వచ్చావు కదా?" అని సత్య ప్రశ్నిస్తే "అవునక్కా,ఇద్దరము కలిసే వచ్చాము" అని సమాధానమిచ్చాడు దీపక్. "మరి నీ బెట్టర్ హాఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావు?" అన్నసత్యతో,అప్పుడే అక్కడికి వచ్చిన వాణి "ఇదిగో సత్యా..ముందు వాళ్ళని కొన్ని రోజులు హాయిగా ఎంజోయ్ చెయ్యనీ" అంది వాణి. మళ్ళీ సిగ్గు పడుతూ "అలాంటిదేమి లేదక్కా,ఈ వీకెండ్ కలుద్దామా" అని అడిగాడు దీపక్. అప్పటికే వారి సంభాషణని వింటున్న ఇంకొంతమంది వారి సహోద్యోగులు అక్కడ చేరి,పార్టీ ఎప్పుడు అని గొడవ చెయ్యడం మొదలుపెట్టారు.

దీపక్  నెలరోజుల క్రితమే ఇండియా వెళ్ళి వివాహం చేసుకుని సతీసమేతంగా అమెరికలో అడుగు పెట్టాడు. అప్పటికే ఐదు సంవత్సరాలుగా అమెరికాలో వర్క్ చేస్తున్న దీపక్ చాలా మంచివాడుగా స్నేహితుల దగ్గర, వర్క్ లో కొల్లీగ్స్ దగ్గర పేరు తెచ్చుకున్నాడు. చాలా నెమ్మదైనవాడు, పరుషం గా ఒక్క మాట మాట్లాడం కాని, ఒకరి గురించి చెడుగా మాట్లాడం కాని దీపక్ కి తెలీదు. అందరికీ తలలో నాలుకగా ఉంటూ, చింతలే లేని చిద్విలాస స్వామిలా ఉంటాడు. సత్యకి దీపక్ చాలా సంవత్సరాలుగా తెలుసు. సత్య, ఆమె భర్త ప్రకాష్ దీపక్ ని తమ ఇంట్లో సభ్యుడిలాగే ప్రేమగా చూసుకుంటారు. చనువుగా అక్కా అని పిలవడం అలవాటు. ఆ వీకెండ్ అనురాధను కలిసాక దీపక్ కి తగ్గ భార్య అనుకున్నారు సత్య, వాణి. ఆ తరువాత ఎన్నో సంధర్భాలలో అను గురించి ఎంతో ఆనందంగా చెప్పేవాడు దీపక్. అప్పుడప్పుడు అనురాధ (అను)ని కలిసినప్పుడు అను కూడా దీపక్ లాంటి భర్త దొరకటం తన అదృష్టంగా చెప్పేది. ఒకరినొకరు ఇష్టపడతూ, ప్రేమగా, ఎంతో సంతోషంగా ఉండేవారు ఇద్దరు.

ఆరు నెలల తరువాత ,ఒక రోజు హట్టాత్తుగా షాపింగ్ చేస్తుండగా అను, దీపక్ కనిపించారు సత్యకి. ఆఫీస్ లో ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి, ఎన్నో రోజులుగా దీపక్ ని కూడా కలవలేదు సత్య. వారిద్దరినీ చూసి నవ్వుతూ పలకరిచింది సత్య "ఓ కొత్త జంట .. బాగున్నారా? చాలా రోజులయ్యింది కదా మనం కలుసుకుని" అని పలకరించింది సత్య.సమాధానంగా దీపక్ అన్నాడు "అవునక్కా రెండు నెలలు పైగా అయ్యిందేమో..ఇంతకి ఏ ప్రోజెక్ట్ మీద పని చేస్తున్నారు మీరు ఇప్పుడు?" అని వివరాలు అడిగాడు. సత్య, దీపక్ కొద్దిసేపు వర్క్ కి సంబంధించిన కబుర్లలో పడిపోయారు. ఇంతలో చట్టుక్కున్న అక్కడ అను కూడా ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చి,"ఇవన్నీ తరువాత మాట్ళాడుకుందాము కాని,ఇంతకీ కొత్త కాపురం ఎలా ఉంది? సెట్టిల్ అయ్యినట్టేనా?"అని అడిగింది సత్య. అను ముభావంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.దీపక్ సర్దుకుని.."అంతా బానే ఉంది" అని పొడిగా సమాధానమిచ్చి"మళ్ళీ కలుద్దాము"అని అప్పటికి సెలవు తీసుకున్నాడు. కొద్దిగా బాధగా అనిపించింది సత్యకి. ఏమయ్యింది వీళ్ళకి?ఇంతకు ముందు వరకు హాయిగా, నవ్వుతూ,తుళ్ళుతూ ఉండేవారిద్దరూ.ఈ రోజు ఎందుకని అలా ఉన్నారో?అను కళ్ళలో ఏదో తెలియని బాధ కనిపించింది సత్యకి. దీపక్ కూడా ఎప్పటిలా లేడు.ఏదన్నా మాట,మాట అనుకున్నరేమో..భార్యాభర్తల మధ్య సహజమే కదా అని అనుకుని ఆవిషయం అంతటితో మర్చిపోయింది సత్య.

వారం రోజుల తరువాత వాణి సుడిగాలిలా సత్య దగ్గరకి వచ్చి నీకొక విషయం చెప్పాలి అంది లోగుంతుతో "సరే పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము" అని సత్య అనగా, ఇద్దరు బ్రేక్ రూం కి వెళ్ళారు. "ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటో?" అని సత్య అడిగింది. "దీపక్ , అను చాలా ముభావం గా ఉంటున్నారు, మొన్న పార్టిలో అయితే ఇద్దరు అపరిచితులానే ఉన్నారు.కలిసి వచ్చి,కలిసి వెళ్ళడం మాత్రం చేసారు కాని,ఇంతకు ముందులా లేరు.ఏదో తేడా" అన్న సందేహం వెళ్ళగక్కింది. సత్య తలాడిస్తూ "నేను కూడా గమనించాను ఆ మధ్య కలిసినప్పుడు..వీలు చూసుకుని దీపక్ ని అడుగుదామా" అని సత్య అంది. "ఇంకా నయ్యం..ఎలా అడుగుతాము ఇలాంటి విషయాలు? నువ్వు వాయి ముడు..చుప్ రహో" అని అంది వాణి. అంతటితో ఆ సంభాషణ ముగిసినా,సత్య కి మనసు ఊరుకోక, ఒక రోజు వాళ్ళింటికి వస్తున్నానని చెప్పి ఒక సప్రైస్ విసిట్ చేసింది సత్య. దీపక్ "ఇంట్లో పాలు లేవు,కనీసం టీ పెట్టడానికి" అని "ఇప్పుడే వస్తానక్కా..మీరు మాట్లాడుతూ ఉండండి" అని హడావిడిగా బయటికి వెళ్ళాడు.అనుతో ఏకాంతం గా గడిపే సమయం దొరికినందుకు సంతోషిస్తూ అడిగింది సత్య అనుని "ఏమిటి మీరిద్దరు ఈ మధ్య ముభావంగా ఉంటున్నారు? ఏ విషయంలోనైనా గొడవ పడ్డారా? సంశయించకుండా విషయం చెప్పు.ఇక్కడ అయినవారికి దూరంగా ఉంటున్నాము, స్నేహితులతోనే అన్ని బాధలు, మంచి , చెడు పంచుకుంటాము..ఫర్వాలేదు చెప్పు"అని అను తో అంది సత్య.

అప్పటి వరకు మౌనంగా ఉన్న అను సత్య మాటలకి కదిలిపోయి ఒక్కసారి బోరుమని ఏడవటం మొదలుపెట్టింది.కొంచెం కంగారు పడింది సత్య."ఏమయ్యింది నిన్ను ఇంత బాధపెట్టే పనేమి చేసాడు దీపక్?" అని అడిగింది సత్య. అను నెమ్మదిగా విషయం విపులం గా చెప్పసాగింది. అంతా విన్నాక సత్య హాయిగా ఊపిరి పీల్చుకుంది.."ఓస్! ఇదా విషయం..విషయం ఇదని తెలిస్తే నువ్వు ఇంత బాధ పడాల్సిన అవసరమే ఉండేది కాదు. నేను, వీణ, ఇంకా ఎంతో మంది ఉన్నాము నీకు,అసలు దిగులు పడకు నువ్వు"అని ఓదార్చింది అనుని.ఇంతలో దీపక్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ వాతావరణాన్ని చూసి అను వైపు అనుమానం గా చూసాడు దీపక్.సత్య అంది దీపక్ తో"ఆదివారం, సోమవారం, మంగళవారం నాకు కుదురుతుంది,నాకు తెలిసినంతవరకు వీణకి  శనివారం, బుధవారం తప్పకుండా కుదురుతుంది.మేము రేపటి నుంచి వచ్చి సాయత్రం ఆరు గంటలకు అనుని పిక్ చేసుకుంటాము.అయినా మీ మగవారందరికీ ఈ ఫోబియా ఏంటయ్యా? ఆ నిమిషంలో మిమ్మల్ని ఆ దూర్వాశ మహాముని ఆవహిస్తాడా? అని దీపక్ ని నాలుగు చివాట్లు పెట్టి అక్కడ నుంచి ఇంటికి వచ్చింది సత్య.

ఇంట్లోకి రాగానే ఎదురుగా భర్త ప్రకాష్ "దేవి గారికి ఈ మధ్య షికార్లు ఎక్కువయ్యాయి. ఎక్కడినుంచో రాక?" నవ్వుతూ అడిగాడు. "దీపక్ దగ్గరకి వెళ్ళి వచ్చానులే" అని పొడిగా జవాబిచ్చింది సత్య. "ఎలా ఉన్నాడేమిటి కొత్త పెళ్ళికొడుకు?" అని అడిగాడు ప్రకాష్."బానే ఉన్నాడు, అనుకి డ్రైవింగ్ నేర్పుతున్నాడు" అని ప్రకాష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ సమాధానమిచ్చింది సత్య. ప్రకాష్ పగలబడి నవ్వసాగాడు."అయితే దీపావళి టపాకాయలు పేలుతున్నాయా? ఏ రేంజ్ లో? అయినా మీ ఆడవారికి డ్రైవింగ్ సెన్స్ తక్కువోయి..ఏమన్న అంటే మండిపడతావు కాని, నిజాలు అప్పుడప్పుడు ఒప్పుకోవాలి మరి నువ్వు" అన్నాడు ప్రకాష్. ఇదిగో ఆ మాటంటేనే నాకు మండుతుంది.నీకు ఎక్కువ టిక్కట్స్ ( సరిగ్గా డ్రైవ్ చెయ్యకపోతే పోలిసులు ఇచ్చే జరిమానాలు) ఉన్నాయా? నాకు ఉన్నాయా?"అని హుంకరించింది సత్య."బాబోయి ఈ వంతు గొడవలు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం అయిపోయాయి కదా? మళ్ళీ ఇప్పుడెందుకు చెప్పు" అని మాట దాటేసాడు ప్రకాష్.

పదిహేను సంవత్సరాల క్రితం సంఘటనలన్ని కళ్ళ ముందు కదిలాయి సత్యకి. అత్యవసరమైతే కాని డ్రైవింగ్ నేర్చుకోవాలన్న కోరిక పెద్దగా ఉండేది కాదు సత్యకి. కాని అన్ని పనులకు ప్రకాష్ మీద ఆధారపడటం సరి అయిన పద్దతి కాదు కాబట్టి, డ్రైవింగ్ నేర్పమని ప్రకాష్ ని అడిగింది సత్య. సరే అని  ఒక పార్కింగ్ లాట్కి తీసుకెళ్ళాడు.అంతే, స్టీరింగ్ ముట్టుకుంటే డమాడం..కార్ యాక్సిలటర్ మీద కాలు వేస్తే డమాడం,బ్రేక్స్ మీద కాలు వేస్తే డమాడం, ఎవరినో ఈ రోజు గుద్దేస్తావా అంటూ, అసలు ఏమి చేస్తున్నావో తెలుసా అంటూ తిట్లు. పూనకం వచ్చిన వాడిలా ఆవేశపడటం, ఆ టెన్షన్ లో ఏమి   మాట్లాడుతున్నాడో అతనికే తెలిసేది కాదు. అయినా సరే తప్పదు కనక కొద్ది రోజులు అలాగే ఓపికగా భర్త సాయంతో డ్రైవింగ్ నేర్చుకోసాగింది సత్య.  కాని రోజు రోజు కి గొడవలు ఎక్కువ అయ్యాయే కాని తగ్గలేదు. ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా, తన కార్ ని తీసుకెళ్ళి సత్య యాక్షిడంట్ చేసేస్తుందని రోజు దడిచిపోయేవాడు ప్రకాష్. ఇలాగే కొనసాగితే అసలు డ్రైవింగ్ అంటేనే తెలియని భయ్యం కలిగి, ఇంక జీవితంలో డ్రైవింగ్ చెయ్యలేను అన్న విషయం అర్ధం చేసుకుని భర్తతో ఇకపై నువ్వు నేర్పక్కర్లేదు , నేనే డ్రైవింగ్ క్లాస్సెస్ తీసుకునో , ఫ్రెండ్స్ సాయంతోనో నేర్చుకుంటాను అని తేల్చి చెప్పేసింది సత్య. కొద్ది రోజులలోనే డ్రైవింగ్ నేర్చుకుంది సత్య. కాని ప్రకాష్ తనను అన్న మాటలు, ఆ రోజుల్లో తాము పడ్డ గొడవలు అంత తేలికగా మర్చిపోలేకపోయింది. నెమ్మదిగా ఎంతో మంది స్నేహితుల ద్వారా, పరిచయస్తుల ద్వారా ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంటా ఉన్నాయి అని తెలుసుకుంది. ముఖ్యంగా భర్తలు భార్యలకు డ్రైవింగ్ నేర్పుతుండగా వారు చిత్రంగా ఎంతో ఆవేశానికి లోనవుతారాని, ఎన్నో విషయాలలో ఎంతో ఓర్పుతో ఉండేవారి విశ్వరూపం మాత్రం భార్యలకు డ్రైవింగ్ నేర్పేటప్పుడు చూపెడతారన్న విషయం అర్ధం అయ్యింది సత్యకి. సమస్య అర్ధం అయితే దానికి పరిస్కారం కూడా ఉంటుందిగా.. పరిస్కారం ఏమిటంటే భార్యలు ఎవ్వరు కూడా భర్తల దగ్గర డ్రైవింగ్ నేర్చుకోకూడదు. భర్త ఎంత గొప్ప వాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత శాంత మూర్తి అయినా, ఎంత ప్రేమ కలిగిన వాడైనా, అసలు ఆ భగవంతుడైనా భార్యలకు డ్రవింగ్ నేర్పేటప్పుడు మాత్రం వారికి కలిగే ఆగ్రహావేశాలకు ఎవరన్నా హడిలిపోవాల్సినదే! పాపం అది వారి weakness అని వారిని క్షమించెయ్యాలి అంతే!


అనుకి రెండు నెలలలో డ్రైవింగ్ దగ్గర ఉండి నేర్పించారు సత్య, వాణి. దీపక్, అను హాయిగా, సంతోషం గా ఉన్నారెప్పటిలాగే! 

నీతి : అమెరికాలో భర్తల సాయంతో డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్తా!

(అవేశపడకుండా ఎంతో ఓర్పుతో, భార్యని ఒక్క మాట కూడా అనకుండా డ్రైవింగ్ నేర్పిన వారిని నేను ఇప్పటివరకు చూడలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే,వారిని ఉద్దేసించి రాసిన పోస్ట్ కాదు అని గమనించ ప్రార్ధన!)

Tuesday, July 17, 2012

పుట్టిన రోజున తిట్లు-అవే దీవెనలు!


హడావిడిగా ఇంట్లో అడుగుపెడుతూనే స్కూల్ బాగ్ విసిరేసి.."అమ్మా..అమ్మా."అని గట్టిగా అరిచినంత పని చేసింది శ్రేయ."ఏంటా అరుపులు? కొంచెం గొంతు తగ్గించు"అంటూ లోపల నుంచి వచ్చింది ప్రియ."నేను వాలంటీరింగ్ కి వెళ్ళాలి, టైం లేదు, నాకు ఆకలిగా కూడా ఉంది"అని సమాధానం ఇచ్చింది శ్రేయ."ఐదు నిమిషాలు ఆగు,ఏదన్నా చేసిస్తాను."అని ఆ పనిలో పడింది ప్రియ.ఆ రోజు శ్రేయ పదహారవ పుట్టిన రోజైనా స్కూల్ కి, తరువాత ప్రతి బుధవారం చేసే వాలంటీరింగ్ కి వెళ్ళడం తప్పలేదు. ఒక్క రోజు స్కూల్ మానినా తరువాత కొన్ని రోజులుగా పెరిగే చదువు భారం తలచుకుని ఒక్క రోజు కూడా స్కూల్ మానడానికి ఇష్టపడదు శ్రేయ.అలాగే వాలంటీరింగ్ కూడా మానడానికి ఇష్టపడదు.శ్రేయ ని హాస్పిటల్ దగ్గర దించుతూ అంది ప్రియ"శ్రేయా,ఎనిమిదింటికల్లా వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాము నేను,నాన్న.డిన్నర్ కి వెళదాము"అని."సరే"అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శ్రేయ.శ్రేయ రాకకై ఎదురుచూస్తూ గడిపింది ఆ సాయంత్రం ప్రియ.అందరు పదహారవ పుట్టిన రోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. శ్రేయ గట్టిగానే చెప్పింది తల్లితండ్రులిద్దరికి,తనకలాంటివి నచ్చవని.చేసేదేమి లేక ఆ రోజు డిన్నర్కి శ్రేయకి ఇష్టమైన రెస్టారంట్ కి తీసుకెళ్ళటానికి నిశ్చయించుకుంది ప్రియ.

హాస్పిటల్ దగ్గర అసహనంగా ఎదురుచూస్తుంది కూతురి కోసం ప్రియ.టంచనుగా ఎనిమిది కొట్టగానే బయటికి వచ్చే శ్రేయ ఆ రోజు ఇంకా బయటకు రాలేదు.అరగంట దాటినా శ్రేయ హాస్పిటల్ నుంచి బయటకు రాకపోవడంతో అసహనంగా ఒక టెక్ష్ట్ మెస్సేజ్ కొట్టింది శ్రేయ కూతురికి.రిప్లై రాలేదు.కొద్దిగా భయ్యం వేసింది ప్రియకి.ఇలా ఎప్పుడు జరగలేదే..ఇంత ఆలశ్యం ఎందుకయ్యిందా అని కారు దిగి,హాస్పిటల్ వైపు వడి,వడిగా  అడుగులు వేయసాగింది శ్రేయ.ఇంతలో సెల్ మోగింది.నంబర్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది."ఎందుకు ఇంత లేట్?వర్క్ ఇంకా ఉందా"అని అడిగింది ఫోన్ తియ్యగానే ప్రియ.తల్లి గొంతు వినగానే బావురుమంది శ్రేయ.విషయం అర్ధం కాక,కూతురు ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడిపోయింది ప్రియ.ఇంటికి వెళ్ళిపోదాము,ఇంక డిన్నర్ కి వద్దు అని ఏడుస్తూనే చెప్పింది శ్రేయ.

ఇంటిలోకి అడుగుపెట్టాక శ్రేయ కొంచెం శాంతించాక విషయం కనుక్కుందాము అని ఆగింది ప్రియ.శ్రేయ ఒక పేరు మోసిన హాస్పిటల్ లో పేషంట్ సప్పోర్ట్ సర్వీసెస్ విభాగంలో వాలంటీరింగ్ చేస్తుంది.వారానికి నాలుగు గంటలు పని చెయ్యాలి. పేషంట్స్ ని డిస్చార్జ్ చెయ్యడం..వాళ్ళకి పువ్వులు అవి ఇచ్చి,వారితో మాట్లాడడం,వారికి కావాల్సినవి తెచ్చి ఇవ్వడం.,లాబ్స్ కి పేషంట్స్ బ్లడ్ సాంపల్స్ తీసుకెళ్ళడం లాంటి పనులు చెయ్యాలి.ఒక్కో రోజు బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉండేవి.హాస్పిటల్ చాలా పెద్దది కావున,ఒక్కొక్క విభాగం చాలా చాలా దూరం గా ఉంటాయి.నడిచి నడిచి కాళ్ళు నొప్పి అని కూడా అప్పుడప్పుడు తల్లికి చెపుతుంది శ్రేయ. అయితే ఏ రోజున నేను వెళ్ళను అనేది కాదు, ఎంతో ఇష్టం గా వెళ్ళేది.

నెమ్మదిగా తనను తాను సంభాలించుకుని జరిగింది చెప్పసాగింది శ్రేయ.ఆ రోజు సుమారుగా 7:30కి ఒక పేషంట్ ని డిస్చార్జ్  చెయ్యాల్సి రావడంతో పేషంట్ ని నర్స్ వీల్ చైర్ లో కూర్చోపెడితే అతనితో కబుర్లు చెబుతూ హాస్పిటల్ బయటికి తీసికెళ్ళింది శ్రేయ. పేషంట్ తాలూకా ఇద్దరు బంధువులు వచ్చి,కారు హాస్పిటల్ ద్వారానికి దగ్గరగా తెచ్చారు. చలి కాలం, స్నో పడుతుంది ఆ రోజు. పేషంట్ ని నెమ్మదిగా వీల్ చైర్ లోంచి లేపారు ఇద్దరు బంధువులు.ఇంతలో బంధువులలో ఒకరు కారు డోర్ అన్లాక్ చేసానా అని పేషంట్ ని వదిలి కారు డోర్ దగ్గరకి వెళ్ళగా పేషంట్ బరువైన మనిషి కావడం వలన జారిపోయి కింద పడిపోయాడు. రెప్ప పటులో జరిగిపోయింది అంతా! వెంటనే పేషంట్ ని పట్టుకున్న అతను శ్రేయ మీద విరుచుకు పడ్డాడు...అంతా నీ వల్లనే..పడిపోతున్న మనిషికి చేయూతను ఇవ్వలేదు అని గట్టిగా దుర్భాషలాడడం మొదలుపెట్టాడు.శ్రేయ పేషంట్ పడిపోతుంటే ఒక్క ఉదుటున ముందుకు ఉరికింది కాని,ఇంతలో ఎన్నోసార్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పిన రూల్స్ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఎట్టి పరిస్థితులలోను పేషంట్ ని వాలంటీర్స్ హాస్పిటల్ బయటికి వచ్చాక టచ్ చెయ్యకూడదు. పేషంట్ తరుపు వారు వుంటారు,వారిదే పూర్తి బాధ్యత పేషంట్ ఒక్కసారి హాస్పిటల్ బయటికి వచ్చాక. హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా  పేషంట్ ని ఎక్కువగా ఫిసికల్ గా టచ్ చెయ్యకూడదు అన్నది చాలా ముఖ్యమైన రూల్ .మొట్టమొదటి వాలంటీరింగ్ మీటింగ్ లోనే చెప్పారు హాస్పిటల్ వారు.దేనినైనా సహిస్తారు కాని,ఒక్కసారి రూల్ అతిక్రమిస్తే మాత్రం చాలా త్రీవ్రంగా పరిణామాలు ఎదురుకోవల్సి వస్తుంది హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి అని శ్రేయకి తెలుసు.

అది గుర్తుకువచ్చి వెంటనే శ్రేయ వెనక్కి వెళ్ళిపోగా,పేషంట్ బంధువు కోపానికి బలి అయిపోయింది.అసలే నల్లవాడు(ఆఫ్రికన్) కావడంతో ఆజానుబాహుడైన అతను నోటికి వచ్చినట్టు తిట్టడంతో శ్రేయ కి ఏమిచెయ్యాలో తెలియక అలా నోట మాట రాక ఉండిపోయింది.అతను తిడుతూనే ఉన్నాడు.అసలే స్నో పడుతూ ఉండటం వలన,జారిపోయిన పేషంట్ కొద్దిసేపు వరకు కొలుకోలేక పోయాడు.జనం చేరారు,అతనిని మళ్ళీ హాపిటల్ లోకి తీసుకుని వెళ్ళారు.శ్రేయకి తను చేసినది తప్పో,ఒప్పో అని అలోచనే కాక,ఇప్పుడు ఆ పేషంట్ కి ఏమౌతుందా అన్న భయ్యం కూడా పీడించసాగింది.ఆ ఆఫ్రికన్ అతను శ్రేయను తిట్టడం మానలేదు.చాలా పెద్ద గొంతుతో హాస్పిటల్ అంతా వినిపించేలా కేకలు వేస్తూనే ఉన్నాడు.శ్రేయ బిక్కచిక్కిపోయి అందరి ముందు తిట్ట్లు తినడమే కాక,తప్పు చేసానా అని భయ్యం తో వణికిపోసాగింది.ఇంతలో గొడవంతా తెలిసి వాలంటీరింగ్ అధికారి ఒకరు వచ్చి,జరిగినదంతా చెప్పమని అడగగా శ్రేయ జరిగినది అంతా చెప్పింది.ఒక పుస్తకం తెచ్చి చెప్పినదంతా రాసి సంతకం పెట్టమన్నాడు ఆ అధికారి.ఇంటికి వెళ్ళు ప్రస్తుతానికి,రేపు నీకు కాల్ వస్తుంది వాలంటీరింగ్ హెడ్ దగ్గర నుంచి,అని చెప్పి పంపించేసాడు.అతను నువ్వు చేసినది సరి అయిన పనే,పర్వాలేదు వెళ్ళు, రేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు.

జరిగినదంతా తల్లితండ్రులకు చెప్పి బోరుమని ఏడ్చింది శ్రేయ.ఎంతో అపురూపం గా ఒక్క మాట కూడా అనకుండా శ్రేయని పెంచారు తల్లితండ్రులిద్దరు.నెమ్మదిగా తనని ఊరుకోబెట్టారు.ఎంత బతిమాలినా భోజనం చెయ్యనని భీష్మించుకున్న అమ్మయిని చూసి శ్రేయ తండ్రి మనస్సు బాధతో విలవిలలాడింది.ఆ రోజు రాత్రి ప్రియ తొ ప్రియ భర్త,"ఎందుకు ప్రియా,శ్రేయకు ఈ వాలంటీరింగ్ అవి అవసరమా?బుధ్ధిగా చదువుకుంటుంది కదా?ఇవన్నీ ఏమిటసలు?"అని అడిగాడు.ఇక్కడ అందరు చిన్నపటి నుంచి ఎక్కడో ఒకచోట ఇలా తోచిన వాలంటీరింగ్ చెయ్యడం చూస్తూనే ఉన్నారు కదా? Giving back to the community concept మనకి తెలియనిదా? అందులోను శ్రేయ తనే ఇష్టపడి చేస్తుంటే వద్దు అని ఎలా చెపుతాము అని జవాబు ఇచ్చింది ప్రియ.

ఆ రోజు ఆ ఇంట్లో ఎవ్వరికి నిద్ర పట్టలేదు. అందులోను పదహారవ పుట్టిన రోజున శ్రేయకు ఇలా జరగడంతో ప్రియకెందుకో చాలా బాధగా అనిపించింది.మరునాడు ఆఫీస్ లో ఉండగా ప్రియకి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి.ఫోన్ ఎత్తగానే వాలంటీరింగ్ హెడ్ మాట్లాడసాగింది.శ్రేయ తమ హాస్పిటల్ తరపున వాలంటీర్ గా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామని,రాత్రి జరిగిన సంఘటనలో తను రూల్స్ కి అనుగునంగా నడుచుకుందని, అవేశంతో ఉన్న పేషంట్ బంధువుకి ఎదురు ఒక్క మాట కూడా చెప్పకుండా మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి జరిగింది జరిగినట్టు చెప్పి వెళ్ళిందని,పొగుడుతూనే ఉంది.భారమైన మనసుతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియ.సాయంత్రం ఇంటికి రాగానే కూతురు మౌనంగా ఉండడం చూసి,దగ్గరగా వెళ్ళి తనకి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పింది ప్రియ కూతురికి.శ్రేయ ఒక చిన్న చిరునవ్వు నవ్వి,"నాకు కూడా మైల్ వచ్చిందమ్మా.You don't worry, I am alright" అని సమాధానం చెప్పింది.నవ్వుతున్న కూతురుని చూడగానే మనసులో బాధ అంతా ఎవరో తీసేసినట్లు అనిపించింది ప్రియకి.ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెపుతున్న కూతురిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ప్రియ భర్త.మరి ఇంక మానేస్తావా వాలంటీరింగ్ అని తండ్రి అడిగితే "No way dad!! పాపం ఆ పేషంట్ వాళ్ళ బంధువు అతనికి ఏమయిపోతుందా అన్న కోపం లో నన్ను తిట్టాడు కాని, నా మీద అతనికేమి కోపం?"అని అంటున్న కూతురుని చూస్తూ ఉండిపోయింది ప్రియ.

తరువాత కొద్ది రోజుల్లోనే ఆ హాస్పిటల్ వాలంటీరింగ్ department మొత్తానికి student coordinator గా ఎన్నుకున్నారు శ్రేయని. గత ఐదు సంవత్సారలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది శ్రేయ ఆ హాస్పిటల్ లో!ఈ తరం పిల్లలని చూసి గర్వ పడాల్సిందే అనుకుంది ప్రియ. 

Thursday, June 7, 2012

I love India



హమ్మయ్య చూస్తుండగానే వీకెండ్ మళ్ళీ వచ్చేసింది అని మనసులో అనుకుంటూ శుక్రువారం వర్క్ కి బయలుదేరింది స్నేహ.బ్లాక్ బెర్రిలో రోజంతా ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో అని కాలెండర్ చూసుకుంది స్నేహ. వెళ్ళగానే కండక్ట్ చెయ్యాల్సిన WIP/SCRUM మీటింగ్,తర్వాత చిన్న చితక మీటింగ్స్ తప్ప ఏమీ లేవు అని ఆనందం తో ఉప్పొంగిపోయింది.డ్రైవ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడ వద్దు అని రోజు లెక్చర్  ఇస్తున్న శ్రీవారి ఆజ్ఞను లెక్కచేయకుండా స్నేహితురాలు వినీల కు ఫోన్ చేసింది. "ఏంటి సంగతి? evening plans ఏంటి?" అని అడిగింది హుషారుగా."What? అప్పుడే weekend వచ్చేసిందా?"అంటూ ఫోన్ లోనే తన అపనమ్మకాన్ని వెల్లడి చేసింది వినీల.  వినీల గొంతులో కూడా ఉత్సాహం గమనించింది స్నేహ."అవును ఏం చేద్దాం?ఇప్పుడే ప్లాన్ చేద్దామా? లేక సాయంత్రం కలుసుకున్నాక decide చేదామా?" అని. "anything is fine with me. ఇప్పుడైతే ఇంకో 15 నిమిషాలు మాట్లాడగలను" అంది స్నేహ. "సర్లే నేను ఉమకి, ప్రీతి కి కూడా కాల్ ఇచ్చి మళ్ళీ కాల్ చేస్తాను అంది" వినీల. అలా అయితే కాల్ వద్దు,text ఇవ్వు , నేను morning meetings అయ్యాక కాల్ చేస్తాను" అంది స్నేహ . "అలాగే" అని ఫోన్  పేట్టేసింది వినీల.

ఆఫీస్ లో అడుగుపెడుతూనే మీటింగ్ లో"నిన్నేమి చేసారు,ఈ రోజేమి చేస్తున్నారు,ఎమన్నా అడ్డంకులున్నాయా"లాంటి చచ్చు  ప్రశ్నలు టీం కి వేసేసి,వాళ్ళందరి మొఖంలో ఎప్పుడు కనిపించే నిరాసక్తత,నిర్లక్ష్యాన్ని గమనించి కూడా గమనించనట్లు ఒక నవ్వు పులుమేసుకుని మొక్కుబడిగా మీటింగ్ కానిచ్చేసింది స్నేహ.శుక్రువారం వచ్చిందంటేనే మనస్సు పని మీద లగ్నం అవ్వదు.చేసేవన్నీ మొక్కుబడి పనులే ఆ రోజు. ఒక్కోసారి అలోచన్లో పడుతుంది స్నేహ,వారమంతా ఏమి ఊడపొడిచేసామనో ఇలా శుక్రువారం వచ్చేసరికి గాల్లో తేలిపోతున్నట్టు,హాయిగా,హుషారుగా ఉంటుంది ప్రాణం అని.వారమంతా టంచనుగా 8:00 గంటలకే ఆఫీస్ కి రావడం,అనంతమైన ట్రాఫిక్ లో గంటకు పైగా డ్రైవ్,తరువాత రోజంతా ఎడతెరిపి లేకుండా మీటింగ్స్,భరించి ఇంటికి వెళ్ళేసరికి, మళ్ళి "డిన్నర్ కి ఏంటీ ఈ రోజు?" అని అడుగుతారు ఇంట్లో..సరే...ఆ డిన్నర్ సంగతేదో తేల్చాకన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుందనుకుంటే,నిద్రాదేవి కరుణించేస్తుంది.పడుకునేటప్పుడు కూడా రేపు గురించేదో చింత.అలా అని ఏదన్నా లోటు లేదా బెంగ ఉందా అంటే,ఏమీ లేదు..ఎందుకు అంత  stress వారమంతా అంటే మరి ...అదంతే!అందుకే శుక్రువారం రావడం తోనే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది..రాబోయే రెండు రోజులు, హాయిగా రిలాక్స్ అయ్యి, తన పనులన్ని తన పేస్ లో చేసుకోవచ్చు అని ఆనందం..

గత ఆరు నెలలలుగా క్రమం తప్పకుండా ముగ్గురు స్నేహితులను శుక్రువారం సాయంత్రం కలవడం ఒక అలవాటుగా మారిపోయింది స్నేహకి.ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి,వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి, స్నేహితురాలను కలవడానికి వెళ్ళిపోతుంది స్నేహ.రాత్రి 11:30/12:00 గంటల వరకు కబుర్లెన్నో చెప్పుకుని, సాధక బాధలు వెళ్ళగక్కుని, ఒకరిని ఒకరు "కష్టాలు కలకాలం ఉండవు"అని ఓదార్చుకుంటూ,ఆడవారి అరోగ్య రహస్యమైన గాసిప్పింగ్ పుష్కలం గా చేసుకుని, ఒక ఎజెండా లేని మీటింగ్ లా గడపడం అలవాటు చేసుకున్నారు ఆ నలుగురు స్నేహితులు.అలాంటి ఒక శుక్రువారం సాయంత్రమే అయినా,ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది.అది ఏంటంటే ఈ రోజు వాళ్ళ మీటింగ్ కి ఒక ఎజెండా ఉందండోయి!

సాయంత్రం నాలుగు కొట్టగానే,ఇంటికి బయలుదేరింది స్నేహ.అర గంటలో నలుగురు కలవాలనుకుంటున్న అడ్డా లో కలిసారు.ఎక్కడికన్నా Indian punctual Time ( లేట్ గా వెళ్ళడం) ప్రకారం వెళ్ళడానికి వీరు జంకరు  కాని,ఈ శుక్రువారం మీటింగ్ కి మాత్రం టంచనుగా అనుకున్న టైం కి కలుస్తారు.కొంచెం లేట్ అయినా మిగతా వారు ఏమి చెప్పేసుకున్నారో,నేను మిస్సైపోయానే అని విలవిలలాడిపోతారు.ఎవరికి కావల్సిన డ్రింక్స్ వాళ్ళు తెచ్చుకుని,మాటల్లో పడ్డారు.వినీల ఉమ వంక చూస్తూ అడిగింది "చెప్పు,ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు?" ఈ వారం కొంచెం మూడ్ బాలేదు. దివ్య కి వాళ్ళ నాన్న కి గొడవ. ఇప్పుడు సర్దుకుంది, కాని దివ్య మాతో చాలా ఫ్రాంక్ గా చర్చించిన కొన్ని విషయాలు ఎందుకో బాగ కలవరపెడుతున్నాయి నన్ను" అని అంది.దివ్య ఉమ కూతురు.కాలేజ్ లో మూడవ సంవత్సరం chemical engineering చదువుతుంది.చాల పద్దతిగా పెరిగిన దివ్య అంటే అందరికి చాలా ఇష్టం. చాలా బాగా పెంచావు ఉమా నీ కూతురిని అని ఎవరన్నా అంటే నా గొప్పతనం ఏమీ లేదు,అది సహజంగానే బుద్దిమంతురాలు అని సమాధానమిస్తుంది ఉమ.నిజమే ఒక్కోసారి దివ్య ని చూస్తే ఉమ అన్నా చెపుతున్న మాటలు నిజమే అనిపిస్తుంది.

"ఉమా వివరంగా చెప్పు? ఏంటి సమస్య?"అని అడిగింది స్నేహ."ఈవారం మొదట్లో దివ్య నాకు ఫోన్ చేసి తనకి 1000$ కావాలని అడిగింది."అన్ని డాల్లర్స్ ఎందుకమ్మా నీకు?"అని అడిగాను."నేను ఇండియా పంపించాలి"అని అంది.అర్ధం కాలేదు నాకు."ఇండియా పంపడమేమిటి ఎవరికి?"విస్తుపోయాను నేను."అమ్మా అన్ని వివరాలు తర్వాత చెపుతాను,నువ్వు నాన్నను కూడా అడిగి నాకు ఎలా పంపుతావో చెప్పు,ఇప్పుడు క్లాస్ ఉంది నాకు అని ఫోన్ పెట్టేసింది దివ్య.సరే అసలు దివ్యకి ఇంత హట్టాతుగా డబ్బు అవసరమేమిటా అని అనుకుంటూ,ప్రదీప్ కి ఫోన్ చెసాను.ప్రదీప్ పూర్తిగా వినకుండానే,కూతురు డబ్బు అడిగిందని తెలియగానే,పంపించేదాము అని చెప్పేసాడు.సాయంత్రం మళ్ళి దివ్య ఫోన్ చేసింది.ఈసారి,ప్రదీప్ కాల్ తీసుకున్నాడు."ఏంటమ్మా? money అడిగావంట కదా, బాంక్ లో ఉన్నాయమ్మ,నువ్వు విత్ డ్రా చేసుకో!"అని చెప్పాడు ప్రదీప్.ఏదో అడగాలి కదా అన్నాట్టు "ఎందుకమ్మా ఇప్పుడు డబ్బు నీకు"అని అడిగాడు."ఇండియా పంపాలి నాన్నా..ఒక ఫ్రెండ్ మనీ రెయిస్ చేస్తొంది,someone is fighting for life."అని చెప్పింది దివ్య.అప్పుడు కాని అర్ధం కాలేదు ప్రదీప్ కూతురు ఆ డబ్బు తన కోసం కాక ఎదో చారిటి కోసం అడిగిందని.వెంటనే అడిగాడు,"అసలు ఎవరా ఫ్రెండ్?నువ్వు డబ్బులు ఎందుకు పంపాలి? అది కూడా ఇండియాకా?నిన్నెవరో బాగానే బుట్టలో వేసారు"అని కూతురితో అన్నాడు ప్రదీప్. "Are you saying I can't trust my friend?" అని ఎదురు ప్రశ్న వేసింది దివ్య. "అది కాదమ్మా,అసలు ఎవరా ఫ్రెండ్?ఇండియా లో నీకు ఫ్రెండ్ ఏంటి? నిన్నెందుకు money పంపమంటుంది?"కొంచెం వివరంగా చెప్పు అడిగాడు ప్రదీప్.

లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు చంటక్క పరిచయం చేసింది ముంబై లో.తను కూడా undergrad చేస్తుంది.పేరు మెహక్.అప్పుడు పరిచయం నాకు.We were in touch and she is one of my very good friends. మొన్నీమధ్య వాళ్ళ maid servant's son, met with a terrible accident and he is fighting for his life and money has to be raised for his opeartion as they cannot afford such huge amounts for the surgery.మెహక్ చాలా money రెయిస్ చేసింది.కాని ఇంకా Rs.50,000 తక్కువయ్యాయట.నన్నుఅడగలేదు కాని,చాలా upset గా ఉంది గత కొన్ని రోజులుగా.నేనే చెప్పాను money పంపుతానని" అంది దివ్య.ప్రదీప్ కి చాలా కోపం వచ్చింది."దివ్యా..నిన్ను మోసం చేయ్యడం చాలా తేలిక.అసలు నీ ఫ్రెండ్ చెప్పింది కట్టు కథ కాదు అని నమ్మకమేమిటి? నీకు తెలియదమ్మా.అలా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు పంపకూడదు. ముందు ఆ మెహక్ చెప్పినవన్ని ఎంత వరకు నిజమో కనుక్కున్నాక  కాని డబు పంపద్దు. నేను కనుక్కుంటాను. నాకు మెహక్ వివరాలు ఇవ్వు."అని నెమ్మదిగా చెప్పాడు ప్రదీప్. 


దివ్య కి వెంటనే కోపం వచ్చి,"నాన్నా..నేను చెపుతున్నాను కదా? నా మీద నమ్మకం లేదా? లేక నేను సరిగ్గా మనుషులను assess చెయ్యలేననుకుంటున్నారా? అయినా నేను అడిగింది 1000$. ఒక వేల నేనే shopping కనో, ఏదన్నా expensive stuff కొనుక్కోవాలనో అడిగితే అప్పుడు నన్ను ఒక్క ప్రశ్న కూడా వెయ్యరు, పైగా ఇంకా కావాలా అని అడుగుతారు.అదే ఏ గుడికో డొనేషన్ ఇమ్మంటే మాత్రం ఒక్కసారి కూడా అలోచించకుండా ఇచేస్తారు.మీరు గత పది సంవత్సరాలుగా మన state లో వెలసిన అన్ని Temples కి ఎంత డొనేషన్ ఇచ్చారో అలోచించండి.TANA కి ఎన్ని సార్లు డొనేట్ చేసారో, ఇండియా లో తిరుపతి హుండిలో వేసిన 10,000 డాలర్లు ఇవన్ని గుర్తే నాకు.అలాంటిది ఈ రోజు ఒక ప్రాణం నిలబెట్టడానికి అడిగితే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారా నన్ను? అదే ఇక్కడ ఎవ్వరికన్నా అలా జరిగితే అవసరం అయితే money డొనట్ చెయ్యరా మీరు? ఇండియా అంటేనే ,do you think we cannot trust anyone there? మీకు మెహక్ గురించి తెలీదు నాన్నా.తను ఈ surgery కి 4.50 lakhs పూల్ చేసింది.Rs.50,000 తక్కువయ్యాయి.అయినా నా internship money ఉంది కదా , అది ఇవ్వండి.మీ డబ్బులు అవ్సరం లేదు" అని తేల్చి చెప్పేసింది దివ్య. "అది కాదమ్మా, నువ్వు ఇంకా చిన్న పిల్లవు, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.నేను ఇవ్వను అని అనడం లేదు, కాని కొద్దిగా వాకబు చేసి ఇద్దాము అన్నానమ్మా..సరే..నీ ఇష్టం వచ్చినట్టే కానిద్దాము. వీలైనంత తొందరలో డబ్బు పంపిద్దాము" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ప్రదీప్.


ఆ రోజు రాత్రి మళ్ళీ  ఫోన్  చేసి, ఇంకో అరగంట మాట్లాడింది దివ్య వాళ్ళ నాన్న తో. "నాన్న , నువ్వు నాకోసం సరే అన్నావు అని నాకు తెలుసు, నాకు అది ఎంత మాత్రం తృప్తి ఇవ్వడం లేదు.నువ్వు మనస్పూర్తిగా ఇచ్చినప్పుడే నాకు తృప్తి" అని చెప్పింది. "లేదమ్మా,ఈ డబ్బులతో ఒక ప్రాణం నిలబడుతుందంటే నాకు కూడా సంతోషమే కదా"అని తండ్రి అనేవరకు దివ్య శాంతించలేదు."నిజమే ప్రదీప్ లాగే మనం కూడా ఎవ్వరిని అంత తొందరగా నమ్మము. ఇక్కడ చూడు, వీళ్ళు మనిషిని బాగా నమ్ముతారు.వాళ్ళు trust చేసారు కాబట్టే ఇంత మంది ఇండియన్స్ ఈ రోజు అమెరికా వచ్చి, ఏ చెత్త resume లో రాసినా..నమ్మారు, ఉద్యోగాలు ఇచ్చారు.మనిషిని మనిషి నమ్మాలి ఉమా..నీ కూతురు దివ్య అంత తెలివి తక్కువది కాదు. ఏమి చేసినా, అలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది." అంది ప్రీతి. "ప్రాణానికి ఇక్కడ వాళ్ళు ఇచ్చే విలువ ఇండియా లో అయితే లేదు కదా." అంది వినీల. "నిజమే ఇక్కడ కాబట్టి ఇలా అర్ధ రాత్రి వరకు కబుర్లు చెప్పుకుని , ఏ బెంగ లేకుండా ఇళ్ళకు చేరుకుంటున్నాము" అంది ప్రీతి."సర్లే ఇప్పుడు ఇండియా కూడా చాలా మారింది. round the clock job చేస్తున్నారు కదా.So పరిస్తితులు మెరుగయ్యే ఉంటాయి" అంది స్నేహ.


"ఏమి మెరుగవ్వడమో మనం ఇది పూర్తిగా మన దేశం అనుకోము లేము, ఇండియా మీద మమకారం తెంచుకోలేము. రెంటికి చెడ్డ రేవడి లా అయ్యాము కదా?" అంది వినీల."మన పిల్లలే నయ్యం, ఇండియా మాదే, అమెరికా మాదే అంటున్నారు.మొన్నీ మధ్య అమ్మ చెపుతుంది మా అక్క , బావ, వాళ్ళ అబ్బాయి ఇండియా వెళ్ళినప్పుడు కర్రెంట్ ఒక రోజల్లా పోతే మా బావగారు తట్టుకోలేక ఆపసోపాలు పడిపోతుంటే వాళ్ళ అబ్బాయి అన్నాడంట.."నాన్న ఇక్కడే పుట్టి పెరిగావు కదా? ఇండియా అంటే ఇలాగే ఉంటుంది అని నీకు తెలిసి కూడా ఆ మాత్రం భరించలేక అంతలా ఇండియా లో weather ని తిట్టుకుంటున్నావు? నువ్వు తిట్టుకోవాలంటే ఇక్కడ traffic గురించి తిట్టుకో, corruption etc problems గురించి తిట్టుకో, అంతే కాని ఏంటి weather గురించి ఇండియా అంటేనే దరిద్రం అంటావు అని..అంత వేడిలో కూడా ఇబ్బంది పడ్డా ఒక్క మాట అనలేదు ఇండియా ఎందుకు వచ్చానని అక్క వాళ్ళ అబ్బాయి"అని ముగించింది ఉమ.మాటల్లో చాలా టైం అయ్యింది అని తెలుసుకుని, ఆ రోజుకి bye చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. స్నేహ డ్రైవ్  చేస్తూ అలోచిస్తుంది దివ్య గురించి. ఎంత మంచి మనసు దివ్యది అని. ఇండియా గురించి ఎక్కువ మాట్లాడుకోవడం తో మనసంతా ఇండియా గురించి అలోచనలతో నిండిపోయింది.ఇక్కడ ఇంత  మదనపడుతూ  ఒకో సారి ఎరక్క పోయి వచ్చాను, ఇర్రుక్కుపోయాను type లో బాధ అనుభవిస్తుంటే, బ్లాగ్ లో  "మేధ ను తారిస్తే ఐటీ బిజ్, బాడీ ని తారిస్తే (తార) ప్చ్, వ్యభిచార్"అన్న కవిత  చదవటం  ఎప్పుడో జ్ఞాపకం వచ్చి,మనసంతా బాధతో నిండిపోయింది. 

Friday, May 18, 2012

భిన్నాభిప్రాయాలు-స్పర్ధలు




సాయంత్రం ఏడు గంటలు దాటింది. ఆఫీస్ నుంచి లేట్ గా ఇంటికి వచ్చిన శాంతికి కిరణ్, హారిక డైనింగ్ టేబుల్ దగ్గర వాదించుకుంటూ కనిపించారు. విషయమేమిటా అని తను కూడా నెమ్మదిగా టేబుల్ దగ్గరికి చేరింది. కిరణ్ శాంతిని చూడగానే "ఇదిగో నీ కూతురి సంగతేంటో చూడు, ఆ బక్కెట్లో ఎవరితోనో గొడవట, దాని గురించి మూడ్ ఆఫ్ అంటుంది" అని. హారిక పగలబడి నవ్వుతుంది. "అమ్మా ... నాన్నకెన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ బక్కెట్ అంటారేంటీ? It's Tumblr Dad!....." అని అంది హారిక. "అదే ఏదో ఒకటి టంబ్లరో, చెంబో, తప్పాలాయో ఎదో ఒకటి లేమ్మా, పేరులో ఏముంది" అని హారికను ఇంకా ఉడికించాడు కిరణ్. సరే విషయమేమిటి అని అడిగింది శాంతి. "నేను చెపుతాను .." అంటూ మొదలుపెట్టాడు కిరణ్

"ఈ మధ్య పాపం అందరు ఐశ్వర్యారాయ్ లావైపోయింది అని బాధపడుతన్నారు కదా. నీ కూతురేమో ఐశ్వర్యారాయ్ మీద ఎదో రాసిందట ఆ బక్కేట్లో,అది ఎవరో స్నేహితురాలికి నచ్చలేదట, చాలా బాధపడుతూ స్పందించిందంట.ఆ స్పందన నచ్చక నీ కూతురు ఇక్కడ ఆవేశపడుతుంది. అందుకే కౌన్సల్లింగ్ చేస్తున్నా" అని చెప్పాడు. "ఏమని రాసావు హారికా,నీ స్నేహితురాలిని అంత బాధపెట్టేలా" అని అడిగింది శాంతి."నేనేమి రాయలేదమ్మా, ఏదో వెబ్సైట్ లో ఎవరో రాసింది నేను Tumblrలో రాసాను రెఫరెన్స్ ఇచ్చి,అయినా నీకు తెలుసు కదా నాకు ఐశ్వర్యారాయ్ అంటే ఇష్ట్టం లేదని" అని జవాబు ఇచ్చింది హారిక. "సరే ఇప్పటికన్నా చెప్పు ఏమిరాసావో .." అని అడిగింది శాంతి .వెంటనే లాప్టాప్ తెరిచి చూపెట్టింది హారిక. "Aishwarya Rai can never get it right. Too perfect, too plastic, too fake, and now, alas, too fat." అని ఉంది అందులో. హారిక వివరించసాగింది."అమ్మా ఇది నా అభిప్రాయం, ఇష్టముంటే చదవాలి,లేకపోతే లేదు,అంతే కాని నా స్నేహితురాలి స్పందన నాకు నచ్చలేదు." 

నవ్వుతూ అడిగింది శాంతి "ఇంతకి ఎమందేమిటి నీ స్నేహితురాలు?" అని."ఐశ్వర్యారాయ్ అంటే నాకు చాలా ఇష్ట్టం, ఇలాంటీవి పోస్ట్ చెయ్యకు. You hurt my feelings. లావవ్వడం, సన్నగా ఉండాలనుకోవటం ఐశ్వర్యా పెర్సనల్ విషయం అది, మధ్య నీకేమిటి ప్రోబ్లం"అని."నువ్వేమన్నావు మరి?"అని అడిగింది శాంతి."ఒక స్మైలీ టైప్ చేసాను"అని చెప్పింది హారిక.మరి ఇంకేమిటి సమస్య ?"అర్ధం కాక అడిగింది శాంతి కూతురిని. ఏముంది అక్కడ తన ఫ్రెండ్ ని ఏమీ అనలేక...ఇక్కడ నా దగ్గర సీమ టపాకాయలా ఎగురుతుంది" అని చెప్పాడు కిరణ్. "అమ్మా నువ్వే చెప్పు, ఎవరి అభిప్రాయాలు వారివి కదా? నేను తన గురించి ఎమీ రాయలేదు కదా, మరి తనకెందుకు అంత బాధ? Aiswarya rai is an actress and she is a public figure. సో నేను కామెంట్ చెయ్యచ్చు." అని సమర్ధించుకుంది హారిక. "పాపం అభిమానులు ఉంటారమ్మా..మరి వారిని నువ్వు బాధపెట్టిన దానివి అయ్యావు కదా..." అని నవ్వుతూ అంది శాంతి. 

 "ok, now stop both of you" అంటూ కిరణ్ కలగచేసుకున్నాడు. "అసలు అవసరం ఉన్న చోట, లేని చోట ఎందుకమ్మా అంతగా రియాక్ట్ అవుతావు హారిక? ఇది పెద్ద విషయమా? ఇక్కడ నువ్వు రాసిన దాన్ని, సమర్ధిస్తే నీకు ఆనందం, అదే విమర్సిస్తేనో, నచ్చలేదని చెపితేనో ,నీకు ఇష్ట్టం ఉండట్లేదు, నీ అహంకారాం దెబ్బ తింటుంది. అసలు దీని గురించి మనం ఇంత సేపు మాట్లాడుకోవాలా?నీ అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరిచావు, నీ స్నేహితురాలికి అది నచ్చలేదు, నువ్వు నవ్వి ఊరుకున్నా, నీ మనసులో మాత్రం విపరీతమైన కోపం పెంచుకున్నావు.అది తప్పు.నీకు ఎలా నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వాతంత్రం ఉందో, అలాగే నీ స్నేహితురాలు కాబట్టి నీకు నిష్కర్ష గా చెప్పింది ,నువ్వు రాసినది తనకి నచ్చలేదని. తన ఫీలింగ్స్ కి కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా?" ఆవేశంతో అంది హారిక 
"నేనేమీ తనని కామెంట్  చెయ్యలేదు  కదా, మధ్య తన కెందుకో అంత బాధ...అది నాకు నచ్చలేదు నాన్నా..." అంది. "పిచ్చిదానిలా మాట్లాడకు, ఇంతకు ముందు నీకు, తనకు ఉన్న స్నేహం అంతా ఈ ఒక్క సంఘటనతో తుడిచిపెట్టుకుపోతుందా?" అని తను కూడా అవేశంగా అడిగాడు కిరణ్. ""yeah , I don't like her anymore" అని నెమ్మదిగా చెప్పింది హారిక.

ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది శాంతి. తనకి నచ్చని మాట ఒక్కటి మాట్లాడితే ఇంక స్నేహాన్ని వదులుకుంటున్నట్లు మాట్లాడుతున్న హారికను చూస్తే ఆ నిమిషంలో భయమేసింది శాంతికి. రేపు మాట్లాడుకుందాము అని "ఇంక పడుకుందామా" అని ఆ సంభాషణ అంతటితో ఆపేసింది శాంతి. శాంతి అలోచిస్తూ ఉండిపోయింది చాలా సేపు. ఆ నిమిషంలో శాంతికి తన స్నేహితురాలు రమ్య గుర్తుకువచ్చింది. రమ్య , శాంతి ఒక ఆఫీస్ లో కలిసి పని చేసేవారు. ఇద్దరూ అమెరికాకి ఒకటే సంవత్సరంలో రావడం , ఒకే కమ్మ్యునిటీలో ఉండడం,ఇద్దరు ఇంచుమించుగా దగ్గర వయసు వారే కావటం వల్ల వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. కిరణ్ , రమ్య భర్త కి కూడా స్నేహం కుదరటంతో ఇద్దరి కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. శాంతి, రమ్య ఇద్దరు ఏడు సంవత్సరాల వరకు, దేశం కాని దేశంలో  ఎంత బాగా సెట్టిల్ అవ్వగలమా అన్న అంశం మీద తప్ప ఇంకేది పట్టించుకునే  వారు కారు.తరవాత వారి ద్రుష్టి అంతా ఎదుగుతున్న వారి పిల్లల మీదే ఉండేది. మాట్లాడుకున్న, కలిసినా, వారికి పిల్లల చదువులు, యాక్టివిటీస్ తప్ప ఇంకేమి మాట్లాడుకునే వారు కాదు.


అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడు ఒక్కసారి కూడా ఇద్దరికి మాట తేడా కాని, ఒకరి వలన ఇంకొకరు బాధపడటం కాని జరగలేదు.ఇప్పుడు పిల్లల బాధ్యత లేదు ఇద్దరికి.శాంతి కూతురు, రమ్య కొడుకు కూడా వేరే స్టేట్స్ లో కాలెజ్ లో చేరారు. ఇప్పుడు రమ్య కి శాంతికి కావాల్సినంత టైం ఉంది, జీవితంలో ఏ లోటు లేదు. తీరిక ఎక్కువ ఉండటంతో ఇద్దరూ వారి పిల్లలు వాలంటీర్ చేసిన ఒక  హాస్పిటల్లో వారానికి మూడు రోజులు వాలంటీర్ చేస్తూ,ఉద్యోగాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఒక రోజున రమ్య చిరంజీవి పార్టీని కాంగ్రెస్స్ లో విలీనం చేస్తున్నాడని,పార్టీని ద్రుష్టిలో పెట్టుకుని అతను తీసుకున్నది మంచి నిర్ణయం అని రమ్య అంది. దానికి శాంతి ఏదో మార్పు తెస్తానని రాజకీయాలలో దిగాడు కదా, మరి అదేంటీ, పార్టీ ఓడిపోతే పోనీ తన సమయం అంతా సంఘసేవకి వినియోగిస్తూ, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసి నెగ్గి తను ఏవైతే ప్రజలకు చెయ్యాలనుకున్నాడో, అవన్ని చెయ్యొచ్చు కదా, ఇలా పార్టీని విలీనం చేసి, తను నమ్ముకున్న సిద్ధంతాల కన్నా, రాజకీయాలలో పదవి ముఖ్యమని నిరూపించినట్టే  కదా" అని అంది శాంతి.రమ్య దానికి విసురుగా.."అంటారమ్మ , ఎన్నైనా అంటారు, NTR రాజకీయాలలో కి వచ్చిన పరిస్తితులు వేరు, ఇప్పుడు వేరు.ఆ రోజుల్లో చిరంజీవి పార్టీ పెట్టినా తప్పక గెలిచేవాడు" అని అంది.శాంతికి మతిపోయినంత పనైంది.అదేంటి రమ్యా..అలా అనేసావు, నెనేమీ అసలు  NTR మాట ఎత్తలేదే. అది జరిగిపోయిన కథ. మనం మాట్లాడుకుంటున్నది ఈ రోజున చిరంజీవి పార్టీని విలీనం చెయ్యడం గురించి కదా..అసలు నీ నిష్టూరమేంటో నాకేమీ అర్ధం కాలేదు" అని అంది శాంతి. "ఏమీ లేదులే, let's change the topic" అని అక్కడితో ఆపేసింది రమ్య.


ఒక వారం రోజుల తరువాత కిరణ్ అడిగాడు శాంతిని, "నీకు, రమ్యకి 
ఎమన్నా మనస్పర్ధలు వచ్చాయా" అని. "అలాంటిదేమీ లేదే అని అంటూనే, వెంటనే అంది..మీకెందుకు వచ్చింది ఆ అనుమానం?" అని . కిరణ్ తనతో రమ్య భర్త చాలా ముభవంగా ఉంటున్నాడని చెప్పాడు.నిజమే , తను కూడా నాతో అంటి ముట్టనట్టు ఉంటుంది" అని అంది. కొద్ది వారాలలోనే పూర్తిగా శాంతితో మాట్లాడడమే మానేసింది రమ్య. అంతటితో ఆగక, వీరిద్దరు ఇతర స్నేహితుల ఇంట్లో కలిసినప్పుడు, అప్పుడు వరకు వారిద్దరి మధ్య లేని పోటీ మనస్తత్వాన్ని అందరు గమనించారు. అసలు నేనేమన్నానని, అంత మూర్ఖం గా నాతో మాట్లాడడం మానేసి, 17 సంవత్సరాల స్నేహాన్ని ఇలా ఒక్క వారం లో తుంచేసింది రమ్య అని శాంతి బాధపడని రోజు లేదు.


శాంతికి ఎంతో చెప్పి చూసాడు కిరణ్ "ఒకసారి డిన్నర్ కి పిలువు రమ్యని. అంతా అదే సర్దుకుంటుంది" అని. శాంతి ఒప్పుకోలేదు.తనే మాట్లాడడం మానేసింది, నేనెందుకు ఎదో తప్పు చేసిన దానిలా రాజికి రావాలి" అని "అయినా శాంతి నువ్వు ఎన్నిసార్లు రమ్యని భోజనానికి పిలిచినప్పుడు, రమ్యకి ఇష్ట్టమైన వంటలే చేసేదానివి కాని, పర్లేదులే నా ఇంటికి వచ్చింది కాబట్టి నాకు ఇష్ట్టమైన వంటలే తినాలి రమ్య అని అనుకోలేదుగా..ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచి,కొన్ని స్థిరిమైన అభిప్రాయాలు ఉంటాయి.ఆ అభిప్రాయలతో మనం ఏకీభవించాలని లేదు, అలా అని వ్యతిరేకించనవసరమూ లేదు.కొంతమంది వారు నమ్మినదే వేదం అని వాదిస్తారు. విని ఊరుకోవడమే! వాదించి వారి దగ్గర మనం సాధించేదేమీ లేదు.ఇప్పుడు ఒక వేళ నువ్వు ఏదన్నా మంచి కార్యం తలపెట్టవనుకో, దాని వలన కొంత మందికి మేలు చెయ్యగలను అని నువ్వు అనుకుంటే, అప్పుడు నువ్వు చేసేదాన్ని సమర్ధించకుండా వితండ వాదన  చేస్తూ,తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించేవారికి నువ్వు నచ్చచెప్పే ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి.ఓపికగా వారు అర్ధం చేసుకునే వరకు వివరించాలి, డీబేట్ చెయ్యాలి. అంతే కాని రాజకీయనాయకుల గురించి, సినిమా ఏక్టర్ల గురించి,సినిమాల  గురించి ఈ శత్రుత్వాలేంటీ? ఇంత చదువుకుని సిగ్గుగా లేదు? 17 సంవత్సరాలుగా నీకు, రమ్య కి మధ్య ఉన్న స్నేహానికి అడ్డు రాని కులం, ఈరోజున ఇద్దరకి తీరుక ఎక్కువై, ఇలాంటివి మాట్లాడుకుని మనస్పర్ధలకు గురయ్యారు.వ్యక్తిగతంగా నీకు ఇప్పుడు కూడా రమ్య అంటే ఇష్ట్టమే, కాని అది నువ్వు ఇప్పుడు ఒప్పుకోడానికి సిద్ధంగా లేవు. ఆ రోజున రమ్య చిరంజీవి పార్టీ ని గురించి నీతో అన్నప్పుడు నువ్వెందుకు రమ్య కి చిరంజీవి అంటే ఇష్ట్టం కదా..అనవసరం గా ఇప్పుడు విమర్శించి తనను బాధ పెట్టాలి అని అనుకోలేదు? నవ్వి ఊరుకుంటే అంతా సర్దుకునేది కదా?" అని  అన్నాడు కిరణ్. "అదేంటి కిరణ్, నువ్వు కూడా నాదే తప్పు అన్నట్టు మాట్లాడతావు" అని అడిగింది శాంతి."తప్పు నీదా, రమ్యదా అని నేను తీర్పు ఇవ్వటం లేదు. నీకు తెలుసు రమ్య ఎంత మంచిది అన్నది,సరే తను అభిమానించేవారిని కించపరిచావని చిన్నబుచ్చుకున్న మాట కూడా వాస్తవమే!కాని నువ్వేమి చేసావు? తన మనసు నొచ్చుకున్నదని తెలిసి కూడా..నువ్వు కూడా మౌనం గా ఉండిపోయావు. ఇద్దరు నిజమైన స్నేహితుల మధ్య ఇగో ఉండదు, ఉండకూడదు.ప్రేమ ఉన్న చోట ఇగో ఉండదు.అందుకని రేపే వెళ్ళి రమ్య తో మాట్లాడు. మనుషులన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి.ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తూ, ఒకరి పట్ల ఇంకొకరు సహనంతో/Tolerance తో ఉండాలి.విమర్శ మంచిదే,కాని అవసరం ఉన్న చోట, అక్కర్లేని చోట విపరీతం గా ఒకరినొకరిని విమర్శిస్తూ , ఎత్తిపొడుచుకుంటూ మనం సంస్కారం గా ప్రవర్తిస్తున్నామా" అన్నాడు కిరణ్.


కిరణ్ చెప్పినవన్నీ నిజాలే అని తెలిసినా, కొద్ది రోజులదాక శాంతి మౌనంగా ఉండిపోయింది. తరువాత ఒక రోజున ఆఫీస్ లో మాట కలిపింది శాంతి. రమ్య కూడా సంతోషంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. మళ్ళి ఇదివరకటిలా ఎమీ జరగనట్టే కలిసిపోయారు.ఇప్పుడు వారి మధ్య రాజకీయాల గురించి కాని, సినిమాల గురించి కాని, టాపిక్స్ రావు. వచ్చినా పెద్దగా వారు వాటిని పట్టించుకోరు.


పొద్దున లేవగానే హారికకు నెమ్మదిగా స్నేహం విలువ, ఒకరి అభిప్రాయాలను గౌరవిచటం గురించి విపులంగా చెప్పాలని నిర్ణయించుకుని నిద్రకు ఉపక్రమించింది శాంతి. 

Monday, April 9, 2012

నిస్వార్ద సేవ




వర్క్ కి డ్రైవ్ చేస్తున్న అనిత మనసులో ఎన్నో సందేహాలు.అసలు తను చేస్తున్న పని సరైనదేనా?ఎందుకు అమ్మా, అత్తయ్యగారు అందరూ భయపెడుతున్నారు?శ్రీధర్ కి, తనకి ఇష్టమని చెప్పినా ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు?ఇంకో వారం రొజుల్లో ఇండియా ప్రయాణం.

ఆఫీసులోకి అడుగుపెడుతూనే, ఏదో ముఖ్యమైన మీటింగ్ అంటూ
అనితకి పిలుపు రాగా,హడావిడిగా కాన్ఫెరెన్స్ రూంలోకి వెళ్ళింది అనిత. కాన్ఫెరెన్స్ రూం లో ఉన్న అనిత సహుద్యోగులు వాళ్ళు పెంచుకుంటున్న కుక్క పిల్లల గురించి,పిల్లుల గురించి, ఆ రోజు వాతావరణం గురించి, రాత్రి జరిగిన బాస్కెట్ బాల్ మాచ్ గురించి అనర్గళంగా మాట్లాడుకుంటున్నారు.అనిత కొలీగ్ రాబ్ అనితను అడిగాడు "Are you excited  about your vacation next week?" అని.అనిత చిరునవ్వుతో "Oh yeah ,looking forward to it" అని సమాధానం చెప్పింది.ఇంతలో అదే రూం లో ఉన్న లిల్లీ అడిగింది అనితని ఎన్ని వారాలలో మళ్ళీ తిరిగిరావడం అని.అనిత క్లుప్తంగా ఐదు వారాలు అని సమాధానం చెప్పింది.మీటింగ్ ముగిసాక తన ఆఫీస్ వైపు అడుగులు వేస్తున్న అనిత దగ్గరికి లిల్లీ మళ్ళీ వచ్చి మాట కలపడానికి ప్రయత్నించింది. అనిత తనకి చాలా పని ఉందని చెప్పి లిల్లీని పంపించేసింది.అనితకి లిల్లీతో మాట్లాడడం అసలు ఇష్టంలేదు.

ఇంతలో శ్రీధర్ ఫోన్ "అనితా అమ్మ మళ్ళీ అలోచించమటుంది, ఏం చేద్దం" 
అని.అనిత నెమ్మదిగా అడిగింది, "నువ్వేమని చెప్పావు?"అని. ఆమ్మకి నచ్చచెప్పాను,"మేమిద్దరమూ అలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇంక దీని గురించి అలోచించటం అంటూ ఎమీ లేదు" అని. "చెప్పావు కదా? అయితే అదే మాట మీద ఉండు నువ్వు. అంతే కానీ ఇలా ఇన్ని సార్లు నువ్వు కూడ అడుగుతుంటే, నాకు కూడా నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమో అని అనుమానం వస్తుంది" అని అంది అనిత.. "ఓకే" అని ఫోన్ పెట్టేసాడు శ్రీధర్.చిన్నగా నిట్టూర్చి పని చేసుకోసాగింది అనిత.లంచ్ టైం అవ్వడంతో కేఫెటీరియా కి వెలదామని బయలుదేరింది అనిత.లిల్లీ దారిలో ఎదురైతే చూడనట్టుగా తల తిప్పుకుని నడకలో వేగం పెంచి తనని దాటుకుని వెళ్ళిపోయింది అనిత. 

లిల్లీ, అనిత గత ఐదు సంవత్సరాలు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు.సహజంగా స్నేహశీలైన అనిత లిల్లీ అంటే ఇష్ట్టపడకపోవడానికి మాత్రం ఒక కారణం ఉంది. ఉద్యోగం మొదలు పెట్టిన తొలి రోజుల్లో లిల్లీ తో చాలా స్నేహం గా ఉండేది అనిత.వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవడం వలన మూడు నెలల వరకు వారిద్దరూ ఎంతో సఖ్యతగా కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవారు. కాని ఒకరోజు లిల్లీ మాటల సంధర్భం లో అనితకి చెప్పింది గతంలో తను  ఎనిమిది సంవత్సరాలు ఒక బార్లో వెయిట్రెస్స్(bartender) గా పనిచేసానని, అది కూడా రాత్రులు పని చెయ్యడం వలన ఎక్కువగా టిప్స్ అవి వచ్చేవని, అలా కష్టపడి పని చేసి సంపాదించిన డాల్లర్స్ తోనే తను పై చదువులు చదివానని చెప్పింది. అనిత నిర్ఘాంతపోయింది. తను రోజు కలిసి పనిచేసేది ఒక bartender తోనా? అది కూడా  బార్లో ఎనిమిది సంవత్సరాలు రాత్రులు  పని చేసిన ఒక  అమ్మాయి తోనా? ఒక్కసారిగా లిల్లీ అంటే విముఖత ఏర్పడింది అనితలో. అనిత చిన్నపటి నుంచి ఏ లోటు లేకుండా పెరిగింది. ఇంట్లో గారాబు పట్టిగా అన్నిట్లో తన మాట నెగ్గించుకుంది. శ్రద్ధగా చదువుకుని అమెరికా వచ్చి పై చదువులు చదివి మంచి ఉద్యోగం లో స్దిరపడింది. చిరకాల స్నేహితుడైన శ్రీధర్ ని ఇష్ట్టపడి వివాహమాడింది. జీవితంలో కష్ట్టమంటూ ఎరుగని అనితకి లిల్లీ ఒక  విశృంఖలమైన జీవితం గడిపిన దానిలా కనిపించింది.లిల్లీ తో అంతకు ముందు ఉన్న స్నేహాన్ని తుంచేసి,ముభావంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పేది అనిత. 


ఐదువారాలు గడిచాయి.అనిత,శ్రీధర్ ఇండియా నుంచి తిరిగివచ్చారు.అనిత చేతిలో ముద్దులొలికే ఆరు నెలల పాప.ఆ పాపని దత్తత చేసుకోడానికే అనిత, శ్రీధర్ ఇండియా వెళ్ళారు.అనితకి చిన్నపటినుంచి ఒక ఆశయం.తనకు చేతనైనంత సేవ పేదవారికి కాని ,సహాయం కావల్సిన వారికి కాని చెయ్యాలి అని.ఒక్క బిడ్డనే కని, ఇంకో బిడ్డను దత్తత తీసుకోవాలి అని ఎప్పుడూ అనుకునేది.అనిత ఇంటిలో, శ్రీధర్ ఇంటిలోను దీనికి వ్యతిరేకించినా , శ్రీధర్, అనిత ఒకే మాటకు కట్టుపడి వాళ్ళు అనుకున్నట్టుగానే ముద్దులొలికే పసి పాపను దత్తత చేసుకున్నారు.తెల్లగా, అందం గా ఉంది అనిత దత్తత చేసుకున్న పాప. ఆ వీకెండ్ స్నేహితులందరినీ పిలిచి పాపని దత్తత చేసుకున్నట్టు, పాప పేరు స్వప్న అని పెట్టుకున్నామని చెప్పింది. స్నేహితులందరూ ముద్దులొలికే పాపని చూసి , అనితని పొగిడారు. గర్వంగా అనిపించింది అనితకి.ఎంత శ్రమ పడిందని తను, ఎన్ని ఫోన్ లు ఇండియా కి, ఎన్ని సార్లు అమ్మ నాన్న పంపిన ఫొటోలు, అత్తగారు , మావగారు పంపించిన ఫోటోస్ లో పాపలు నచ్చక, కనీసం ఒక ఆరు నెలలు శ్రమపడితే కాని, ఈ అందాల పాప తనకు దక్కలేదు. చూడటానికి ముక్కు తీరు బాగుండాలి,తెల్లగా ఉండాలి, అరోగ్యవంతురాలై  ఉండాలి అని ఎన్నో రోజులు వెతికి, అన్నీ  కుదిరితేనే దత్తత చేసుకుంది పాపను అనిత. పాపని కన్న తల్లిలా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అనిత.


పాప వచ్చిన దగ్గర నుంచి వర్క్ నుంచి ఇంటికి తొందరగా వచ్చేసేది అనిత. ఒకసారి వర్క్ లో లిల్లీ చెయ్యల్సిన ఒక ప్రోజెక్ట్ లో కొద్దిగా వెనుకపడి ఉండటం వల్ల అనిత ని సహాయపడమని చెప్పాడు అనిత బాస్.అనిత మనసులో అనుకుంది..ఇప్పుడు ఈ మహా తల్లికి అంతగా రాచకార్యాలేమున్నాయో, ఇలా డెడ్లైన్ మిస్స్ చేస్తుంది అని. బాస్ చెప్పాడు కాబట్టి అయిష్టం గా నే ఒప్పుకుంది అనిత.ఒక వారం రోజులు తను రిమోట్ గా  పని చేస్తానని అర్జీ పెట్టుకుని దానికి బాస్ నుంచి ఆమోదం వచ్చాక అనితకి చెప్పింది లిల్లీ.అనిత కి చాలా కోపం వచ్చేసింది. లిల్లీ రిమోట్ గా పని చేస్తే తను రోజు అనుకున్న టైం కి ఇంటికి వెళ్ళటం కుదరదు.వర్క్ లో కూడా కొన్ని మీటింగ్స్ తనే వెళ్ళాల్సి వస్తుంది అని చాలా చిరాకు అనిపించింది.మర్నాడు తన అక్కసు అంతా తన ఇంకో కొల్లీగైన జేంస్ తో వెళ్ళబోసుకుంది అనిత.లిల్లీ కి అంతగా వెలగబెట్టాల్సిన పనులేమిటో, హాయిగా ఎవరన్నా ప్రియుడితో కలిసి వెకేషన్ కి చెక్కేసి ఉంటుందని,తన మీద ఒక్కసారిగా ఇంత పని రుద్దేసి వెల్లిపోయింది అని చెప్పింది అనిత. తను ఆరు నెలల పాపతో ఎంత ఇబ్బంది పడుతుందో, రాత్రులు నిదుర లేక జాగారం చేస్తూ , పొద్దున్న వర్క్ కి టైం కి వచ్చి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా అని  జేంస్ ని అడిగింది అనిత. జేంస్ సంశయిస్తూ అనితకి చెప్పాడు లిల్లీ కూతురికి జ్వరంగా ఉండటం కారణం గా తను రిమోట్ గా పనిచేస్తుందని చెప్పాడు అనితకి.ఎవరితో పడుకుని, ఎన్నో ప్రియుడికి తో కన్న కూతురో అని మనసులో హేళనగా అనుకుంది అనిత.


వారం రోజుల తర్వాత వర్క్ కి వచ్చింది లిల్లీ.అనితకి తాంక్స్ చెప్పి తన ఆఫీస్ వైపు వెళుతుండగా , జేంస్ పలకరించడతం తో అతనితో మాట్లాడసాగింది లిల్లీ. జేంస్ తో తన సంభాషణ ముగియగానే మళ్ళీ అనిత ఆఫీస్ కి వచ్చి అడిగింది లిల్లీ."పాపను దత్తత్త చేసుకున్నవంట కదా?" అని. అవునని సమాధానం చెప్పి, తను గత వారం లిల్లీ వల్ల ఎంత ఇబ్బంది పడిందో చాలా కటువుగానే చెప్పింది అనిత. లిల్లీ నెమ్మదిగా అనిత కళ్ళలోకి సూటిగా చూసి, క్షమాపణలు కోరి, తను కూడ సంవత్సరం క్రితమే ఒక అమ్మాయిని దత్తత చేసుకున్నట్టు, ఆ అమ్మాయికి చూపు లేదని చెప్పింది అనితకి.తను బ్రైలీ నేర్చుకుంటుందని, ఆ పాపకి కొద్దిగా వంట్లో నలతగా ఉంటే తను రావడానికి ఇబ్బంది అయ్యిందని చెప్పింది.ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది అనిత.


ఆ రోజు రాత్రి అనితకి నిద్రపట్టలేదు.పాప తన ఇంట్లో అడుగుపెట్టిన రోజునుండి తన లైఫ్ ఎంత బిసి అయిపోయిందో తనకు తెలుసు. ఒక్క నిమిషం తీరిక ఉండటం లేదు. అలాంటిది ఒక చూపులేని అమ్మయిని పెంచడం అంటే..మాటలా. ఆ ఊహకే వణికిపోయింది అనిత.అసలు లిల్లీ ఎందుకు ఒక చూపు లేని  అమ్మాయిని పెంచుకుంటుంది ..ఇలా  ఎన్నో ప్రశ్నలతో ఆ రాత్రి గడిపి మర్నాడు లిల్లీ కనపడగానే అడిగింది తన సందేహం తీర్చమని. లిల్లీ చెప్పింది తను లైఫ్ లో ఎన్నో కష్టాలు చూసిందని, తను అప్పుడే అనుకుంది అట, ఎవరికన్నా తను డబ్బు సంపాదించినప్పుడు సాయపడాలి అని. అయితే చూపులేని అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు దత్తత, అన్ని సక్రమంగా ఉన్నా అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా అని అనిత అడిగితే, లిల్లీ సమాధానం అలాంటి   అమ్మాయిని  తను కాకపోయినా ఎవరన్నా దత్తత చేసుకుంటారని, ఇలాంటి ఒక పాపకు జీవితాన్ని, ఒక ఇంటిని ఇవ్వడమే తనకి ఇంకా తృప్తి కలిగిస్తుందని చెప్పింది లిల్లీ. అనితకి ఒక్కసారిగా లిల్లీ ఎంతో మహోన్నతురాలిగా కనిపించింది.ఇదే కదా స్వార్ధం లేని స్వచ్చమైన మానవ సేవ? తను ఎన్ని అలోచించింది? ఎంతమంది అంద విహీనం గా ఉన్నారని, నల్లగా ఉన్నారని తిరస్కరించి అందం గా ముద్దులొలికే పాపను మాత్రమే దత్తత చేసుకుని తెచ్చుకుంది.
ఎంత మందితోనో చెప్పుకుంది అనిత తను చేసిన ఆ మంచి పనిని. స్నేహితులందరూ పొగుడుతుంటే ఉప్పొంగిపోయింది. లిల్లీ మాటవరసకు కూడా ఎవరికి చెప్పలేదు తను ఒక చూపులేని అమ్మాయిని పెంచుకుంటున్న విషయం.


లిల్లీ పట్ల ఇన్నాళ్ళు తను ప్రవర్తించిన తీరు తలచుకుంటేనే తన మీద తనకే అసహ్యం కలిగింది అనితకి.చేతులెత్తి మొక్కాలనిపించే సంస్కారం ఈ అమ్మాయి సొంతం కదా అని కళ్ళలోంచి జారిపడుతున్న అశృవులను ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తపడింది. 

(ఇది నిజంగా జరిగిన సంఘటన.కొద్దిగా మార్పులతో రాయటం జరిగింది)

Monday, March 26, 2012

పెళ్ళి, ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే!

రమ్య, మంజు, సంజయ్, సునీత మంచి స్నేహితులు.


రమ్య అందమైనది, తెలివైనది,గుణవంతురాలు.తల్లితండ్రుల గారాబు పట్టి.
వారు చెప్పినట్టు నడచుకుని డాక్టర్ అయ్యింది.అమెరికా లో ఉన్నా డేటింగ్లు మీటింగ్లు అనక తల్లి తండ్రులు సంతోషంగా, అన్యోన్యంగా ఉండటం చిన్నపటినుంచి చూసిన రమ్య తల్లితండ్రులకే వదిలేసింది తనకి వరుడిని వెతికే భాద్యత. తోటి స్నేహితులు వారిస్తున్నా తల్లితండ్రులు చూపించిన అబ్బాయిని వరించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న కొత్త పెళ్ళికొడుకు చాల అద్రుష్టవంతుడన్నారు అందరూ. రమ్య ఎంత సాంప్రదాయకంగా పెరిగిందో అతనికి తెలియచెప్పి,వారి కొత్త కాపురానికి దీవించి పంపారు తల్లితండ్రులు, స్నేహితులు.వీసాలు, గ్రీన్ కార్డ్లు,సిటిజెన్షిప్ల అవధులు అన్ని దాటి ఐదు సంవత్సరాల తర్వాత తను కూడా ఒక మంచి డాక్టర్ అనిపించుకున్నాడు రమ్య భర్త. ఒక శుభముహుర్తాన్న  తనతో పాటు పని చేస్తున్న అమెరికన్ నర్స్ మోజులో (అతని భాష లో ప్రేమ) పడ్డాడు. సదరు నర్సమ్మకి ఇద్దరు అమ్మాయిలు మొదటి భర్త నుంచి, ఒక అబ్బాయి రెండవ వివాహం నుంచి సంక్రమించగా ప్రస్తుతం ఒంటరిగా ఉంది. రమ్యకి తెలియకుండా నర్స్ తోను, నర్స్ పిల్లలతోను చాలా బిసి అయిపోయాడు రమ్య భర్త.  ఎట్టకేలకు ఒక రోజు విషయం గ్రహించిన రమ్య భర్తని వారించింది. జరిగినదేదో జరిగింది, మర్చిపోతాను, నర్స్ ని మర్చిపొమ్మంది. అందమైన తెల్ల నర్స్ నా మనసు దోచింది అని చెప్పాడు రమ్య భర్త. తల్లితండ్రులకి ఈ విషయం తెలిస్తే బాధపడతారని ఒక ఆరు నెలలు ఓపిక పట్టింది రమ్య. పరిస్తితులు మారకపోవడంతో ఇక అతనితో కలిసి జీవించలేనని చెప్పింది రమ్య తన తల్లితండ్రులకు. విడాకులు తీసుకుంది రమ్య. జీవితం అంటే ఏ రకమైన ఆసక్తి లేకుండా మిగిలిపోయింది.


మంజు తల్లి తండ్రిలిద్దరు ఇండియా నుంచి వలస వచిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మంజు శ్రద్ధగా చదువుకుని పోస్ట్ గ్రాడ్యూట్ పూర్తి చేసింది. అమెరికన్,ఇండియన్ అబ్బాయిలు ఎందరో తనని ఇష్టపడ్డా తండ్రికి ఇష్ట్టముండదని తెలిసి తండ్రి చూసిన వ్యక్తినే పెళ్ళాడింది. కొద్ది రోజులకే వారికి అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకోవటం జరిగింది. ఎంతో చలాకిగా ఉండే మంజు ఒక్కసారిగా జీవితం లో అన్నీ కోల్పోయిన దానిలా అయిపోయింది.


సంజయ్  అమెరికాకి పై చదువులకోసం వచ్చి మంచి ఉద్యోగంలో స్దిరపడ్డాడు.  ఇండియాలో ఉన్న సంజయ్ తల్లితండ్రులు చదువుకున్న, అందమైన  అమ్మాయిని వెతికి కొడుక్కి పెళ్ళి చేసారు. నాలుగు వారాలు సెలవు తీసుకుని ఇండియా వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు సంజయ్.
అందమైన, చురుకైన భార్య దొరికిందని సంతోషించాడు సంజయ్. ఇంకో నెలలో వీసా పంపిస్తానని చెప్పి అమెరికా తిరిగి వచ్చాడు. చెప్పినట్టుగానే నెల రోజుల్లో వీసా పంపించాడు భార్యకి. ఎంతో అత్రుతతో భార్య కోసం ఎదురుచూస్తున్న సంజయ్ కి, ఏర్పోర్ట్ లో  సంజయ్  భార్యని కలుసుకోవడానికి తన బోయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. సంజయ్ భార్య సంజయ్ కి అతనిని పరిచయం చేసి, సంజయ్ ఎమీ అనుకోవద్దు.. నేను, ఇతను మూడు సంవత్సరాలుగా  ప్రేమించుకుంటున్నాము. వీసా లేకపోవడం వలన ఇన్నాళ్ళు నేను అమెరికా రాలేకపోయాను. నేను ఇతన్ని విడిచి ఉండలేను. సోరీ , బుట్ థాంక్ యు అని చెప్పి చక్కా వెళ్ళిపోయింది. నివ్వెరపోయాడు సంజయ్. ఎన్ని రోజులైనా ఈ విషయం మరచిపోలేక అందరూ  మళ్ళీ పెళ్ళి చెసుకోమంటున్నా వినటం లేదు సంజయ్. 


సునీతకి అమెరికాలో పిన్ని, బాబయి గ్రీన్ కార్డ్ స్పోన్సెర్ చేస్తే చిన్న వయసులోనే అమెరికా కి వచ్చి ఎం.ఎస్ పూర్తి చేసి తను ఇష్ట్టపడ్డ అబ్బాయిని , తల్లితండ్రులని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకుంది.ఇరువైపు వారి పెద్దలకు అంగీకారం లేనందువలన, కొద్ది రోజులలోనే నీ వాళ్ళు, నా వాళ్ళు అని తగాదాపడి విడాకులు తీసుకున్నారు. అయితే సునీత ఢీలా పడిపోలేదు.


తను స్కూల్ లో నేర్చుకున్న ఫ్లూట్ లెస్సన్స్ లో మళ్ళీ చేరింది. సమయం ఉన్నప్పుడల్లా చిన్నపటినుంచి చేసిన వాలెంటీరింగ్ మళ్ళీ మొదలుపెట్టింది. టెన్నిస్ క్లబ్ లో చేరింది. తనకంటూ ఒక జీవితం , దానికి  ఒక అర్ధం ఏర్పరుచుకుని ముందుకు సాగింది.


సునీత తన స్నేహితులకి చెప్పింది -" పెళ్ళి, ప్రేమ జీవితంలో ఒక భాగం అవ్వాలి కాని, అవే జీవితం కాకూడదు . Husband/wife  should be an addition in your life along with your work, sports , hobbies, friends and parents but he/she cannot be your life. The moment you start thinking he/she is your life and there is no life beyond them, you are finished. Common guys! cheer up and please get along with your life. Life is more beautiful than just a relationship."


ప్రేమ, పెళ్ళి విఫలమైతే బాధ ఉంటుంది నిజమే, కాని సునీతలా అందరూ అలోచించగలిగితే ఎంత బాగుండు అనిపించింది.

Wednesday, March 21, 2012

బాబోయి సినిమా

"అమ్మా.. నిన్ను "అమ్మా" అని పిలుస్తున్నా కదా , మరి నాన్నని "నాన్నగారు" అని ఎందుకు పిలవాలి? ఎవరో పరాయివారిని సంభోదించినట్టు ఉంది.నేను "నాన్న" అనే పిలుస్తాను" అని సుమిత్రతో అంది ఏడేళ్ళు నిండిన అంజలి.అంజలిని దగ్గరకి తీసుకుని సుమిత్ర "అలా కాదమ్మ, నేను మా నాన్నగారిని "నాన్నగారు" అనే పిలిచేదాన్ని, అమ్మమ్మ కూడా మా తాతగారిని అలాగే పిలిచేది. నువ్వు కూడా "నాన్నగారు" అనే పిలవాలి.నాన్నని ఏకవచన సంభోదన చెయ్యకూడదు తల్లీ. గౌరవంగా పిలవాలి" అని సమాధానం ఇచ్చింది సుమిత్ర. అంజలి వెంటనే "మరి నిన్ను కూడా గౌరవంగా "అమ్మగారు" అని పిలవాలి కదా?" బాణంలా దూసుకొచ్చింది ప్రశ్న. "నిజమే తల్లితండ్రులిద్దరిని గౌరవించాలి. కాని అమ్మ దగ్గర పిల్లలకి చనువు ఎక్కువ కాబట్టి "అమ్మా" అనే పిలుస్తారు.నాన్నని "నాన్నగారు" అని అనడమే కరెక్ట్." అని చెప్పింది సుమిత్ర. "అదేంటి నాకు నువ్వంటేనే కొద్దిగా భయ్యం. నాన్న దగ్గరే నాకు చనువు ఎక్కువ. అందుకని నేను "నాన్న" అనే పిలుస్తా" సూటిగా చెప్పింది అంజలి. బదులు ఏమివ్వాలో తెలియక "నువ్వు "నాన్నగారు" అనే పిలవాలి" కళ్ళెర్ర చేస్తూ కట్టినంగా చెప్పింది సుమిత్ర. బిక్కమొహంతో "అలాగే" అని చెప్పి అక్కడ నుంచి జారుకుంది అంజలి.

ఆ రోజు సాయంత్రం అంజలి తన తండ్రితో "నాన్నగారు మిమ్మల్ని "నాన్న" అని అనొచ్చా? అమ్మ కోప్పడుతుంది అలా పిలుస్తానంటే" అని అడిగింది. సురేష్ ప్రేమగా అంజలిని దగ్గరకి తీసుకుని బుజ్జగిస్తూ "నీకెలాగ పిలవాలనుంటే అలా పిలువు అంజు, నువ్వెలా పిలిచినా నాకిష్టమే" అని చెప్పాడు. పట్టరాని ఆనందంతో అంజలి "అమ్మా, నేను "నాన్నా"అనే పిలుస్తా"అని గట్టిగా సుమిత్రకి వినిపించేటట్టు అరిచి పక్క గదిలోకి పారిపోయింది అంజలి. ధుమధుమలాడుతూ వచ్చింది సుమిత్ర "అదేంటి సురేష్? నేను చెప్పాను కదా అలా పిలవకూడదు అని? నువ్వు అమ్మ చెప్పినట్టు వినాలి అని చెప్పకుండా దానిని వెనకేసుకొస్తావెందుకు?" అని అడిగింది."పిలుపులో ఏముందోయి? మనసులో గౌరవం ఉండాలి కాని" అని తేల్చేసాడు సురేష్. "మీ జిల్లాలో ఉన్న అలవాటేగా ఎవ్వరినీ మర్యాదగా పిలవకపోవడం? నా కూతురు అలాంటి భాషకి అలవాటు పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలలో ఇది ఒకటి" అని విసురుగా చెప్పింది సుమిత్ర. ఇంక ఆ సంభాషణ సాగదీస్తే ప్రమాదం అని తెలుసుకున్న సురేష్ అక్కడితో ఆపేసాడు.

అంజలి తన తండ్రిని రోజు "నాన్నా" అని పిలుస్తూనే సుమిత్రని చూడగానే నవ్వుతూ "నాన్నగారు" అని పిలుపు మార్చేది.కొన్ని రోజులకి పూరి జగన్నాథ్ అను ఒక గొప్ప డైరక్టర్ గారు వారి సినిమాలో అమ్మని "ఒసే" అని ఇంకా పేరు పెట్టి కూడా పిలవచ్చు అని సదరు హీరో గారి ద్వారా మన అంధ్రరాష్ట్రం ప్రజలకు తెలియచెప్పారు. అంజలి సుమిత్ర దగ్గరికి వచ్చి "నేను నిన్ను రేపటినుంచి సుమిత్రా అని పిలుస్తాను. సినిమాలో హీరో అమ్మని అలా పిలుస్తున్నాడేంటి  అని నాన్నని అడిగితే "That means they are very close అన్నమాట" అని చెప్పారు. అందుకని నేను కూడా నిన్ను సుమిత్రా అని పిలుస్తాను" అని చిలిపిగా చెప్పింది అంజలి. తెలివిగా తను కూడా చురక వేసింది సుమిత్ర "అందుకే కదా ఆ హీరో ని "ఇడియట్" అన్నారు. నిన్ను కూడా నేను అలా పిలవనా?"  అంటే "ఊహు వద్దులే..అంజు అనే పిలువు" అని నవ్వేసి వెళ్ళిపోయింది అంజు.
మళ్ళీ యుద్దానికి సిద్ధమయ్యింది సుమిత్ర సురేష్ తో "అంజలి తెలిసో తెలియకో నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు చెప్పిన సమాధానం కరక్ట్ కాదు.ఆ సినిమాలో హీరో  తల్లిని అలా సంభోదించడం తప్పు అని ఎందుకు విడమర్చి చెప్పలేదు? అని నిలదీసింది సుమిత్ర. "నాకేమి తప్పు అనిపించలేదు.తల్లితండ్రి అంటే చాలా ప్రేమగానే ఉన్నాడే హీరో.పిలుపులో ఏముంది చెప్పు" అని వాదించాడు. "ప్రేమ ఉందా లేదా అన్నది కాదు ఇక్కడ సమస్య. మనం మర్యాదగా మాట్లడం పిల్లలకి నేర్పించాలి" అన్నది సుమిత్ర.


కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.అంజలి అవన్నీ చూస్తూనే ఉంది. తనకు వచ్చిన సందేహాలు అన్ని అడుగుతూనే వుంది.ఇంట్లో తల్లి చెప్పే ఎన్నో విషయాలకు, సినిమాలో చూపించే వాటికి పొంతన లేక తల్లినో, తండ్రినో ప్రశ్నిస్తూనే ఉంది.సాధ్యమైనంతవరకు,మంచి చెడు భోదిస్తూ వచ్చింది సుమిత్ర.

కొద్ది రోజుల తర్వాత "సరిగ్గా చదువుకోవటం లేదు ,ఇంకా కష్ట్టపడి చదవాలి" అని అంజలి తండ్రి మందలిస్తే "నువ్వు చదువుకున్నావు కదా నాన్నా, మరి నువ్వేమన్నా ప్రెసిడెంట్ అయ్యావా? పర్లేదులే నేను చదువుతుంది చాలు" అని సమాధానం చెప్పింది అంజలి. "అమ్మో సినిమా ప్రభావం" అని అవాక్కైపోయాడు సురేష్.(ఏదో సినిమాలో నితిన్ అనే హీరో తండ్రి పాత్రదారుడితో అన్న మాటలట అవి.)

ఆ రోజునుండి ఒక్క మాట మీద నిలబడి తెలుగు సినిమాలు చూడడం మానేసారు సుమిత్ర, సురేష్.అంజలి ఎదురుప్రశ్నలు, సమాధానాలు ఆ రోజునుంచి తక్కువయ్యాయి.

సరదాకి, వినోదానికి చూసే సినిమాలు తెలియకుండానే వాటి ప్రభావం చూపుతాయి పిల్లల మీద. కొద్దిగా మంచి చెడు తెలుసుకునే విచక్షణా జ్ఞానం అలవర్చుకున్నాక వాళ్ళ మీద సినిమా ప్రభావం ఎక్కువగా ఉండదు.హీరోలని ఒక ఆదర్శంగా తీసుకుంటున్న ఈ రోజుల్లో యువతరం మీద ఇలాంటి సినిమాల ప్రభావం పడకుండా ఉంటే చాలు. సమాజం మీద చెడు ప్రభావం చూపే సినిమాలు ప్రేక్షకులు వినోదం కోసం చూస్తున్నంతసేపు ఈ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే audience reject చెయ్యడం  మొదలు పెడతారో, అప్పుడే మార్పు వచ్చే chances ఉన్నాయి అన్నది నా అభిప్రాయం.

(అమయగారి "పూరీ జగన్నాథ్ ''బూతుల బిజినెస్ మేన్''
వనజవనమాలి గారి "ఐటం సాంగ్స్ - అశ్లీల సాహిత్యం"
పై రెండు పోస్ట్ లు చదివాక ఈ పోస్ట్ రాయలనిపించింది. రవితేజ గారి అభిమానులు, నితిన్ గారి అభిమానులు, పూరి గారి అభిమానులు నన్ను క్షమించ ప్రార్ధన. )

Tuesday, March 13, 2012

ప్రేమంటే?





కొద్దిరోజులక్రితం వర్క్ లో ఊపిరి పీల్చుకోలేనంత పని ఉంటే మా డిపార్ట్మెంట్లో అందరు రేయనక, పగలనకా కష్టపడి పనిచేస్తూన్నప్పుడు జరిగిన సంఘటన.
అర్ధరాత్రి వరకు పనిచేసి ఆ రోజు లేట్ గా వర్క్ కి వచ్చిన నాకు..
ఒక క్యూబ్ దగ్గర చాలా మంది నా సహ ఉద్యోగులు గుమికూడి ఉండడం ఆశ్చర్యం కలిగించింది. 
ఏమై ఉంటుందా అని కుతూహలంతో నేను కూడా చేరా అందరితో.
జెన్ని అని నాతోటి ఉద్యోగి క్యూబ్లో తన డెస్క్ మీద అందమైన పూలగుత్తి.
జెన్ని మెరిసే కళ్ళతో అందరికీ వివరిస్తున్నదేమిటంటే..జెన్ని భర్త  జెన్ని రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తున్నందుకు, తను వర్క్ వలన స్ట్రెస్స్ కి గురవుతుందని తనకి ఒక మంచి గ్రీటింగ్ కార్డ్,పూల గుత్తి పంపించాడు.
"హనీ,హోప్ యు విల్ బీ రిలీవ్డ్ సూన్ ఫ్రం దిస్ స్ట్రెస్స్. ఐ లువ్ యు" అంటూ ఇంకా చాల రాసాడు. 
జెన్నికి "యు ర్ సో లక్కి.యు హవ్ ఎ గ్రేట్ హస్బండ్" అని నా పక్కనే ఉన్న నా కొలీగ్స్ తనకి ప్రశంసల వర్షం కురిపించారు. 
ఒక ఫ్రెండ్ అంతటితో ఆగక నా వెంటే నా క్యూబ్ కి వచ్చి..జెన్ని ఎంత అద్రుష్టవంతురాలో పదే పదే చెపుతూ ఇండియన్ హస్బండ్స్ కి ప్రేమ వ్యక్తపరచడమే రాదు అని తెగ బాధపడిపోయింది.
ఇప్పుడు దానిగురించి అలోచించేంత సమయం మనకి లేదు కాని..పనిలో నిమగ్నమౌదాము అని చెప్పి తనని అప్పటికి ఆ మూడ్ లోంచి బయటపడేసాను. 
ఆ ఫ్రెండ్ ఉండేది మా కమ్యునిటీయే కాబట్టి ఇద్దరము అప్పుడప్పుడు కలిసి ప్రయాణం చేస్తుంటాము. ఆఫీస్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన సంభాషణ మళ్ళీ ఆ రోజు సాయంత్రం గుర్తుకు వచ్చి జెన్ని అద్రుష్టం గురించి పదే పదే వాపోతున్న నా స్నేహితురాలిని చూస్తే జాలి వేసింది. 
నా ఫ్రెండ్ భర్త మితభాషి. ఎక్కువగా మాట్లాడకపోయినా తనని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒక నెల రోజులు రాత్రి పగలు వర్క్ తో సతమౌతున్న తనని ఇంటికి రాగానే ఏ కష్టం లేకుండా అలసి వచ్చిన తనకి చెతనైతే వంట చేసో, కాకపోతే ఫుడ్ బయటనుండి తెప్పించో ఇంకా తన ఆరేళ్ళ పాపని కూడా తనే చూసుకున్నారు. అనుక్షణం తను అలసిపోయి ఉంటుందన్న విషయం గ్రహించి నా ఫ్రెండ్ నోరు తెరిచి అడగకుండా సాధ్యమైనంతవరకు ఎంతో సహకరించేవారు. కాని అతనికి రోజుకి ఒక పది సార్లు ఫోన్ చేసి తీపి కబుర్లు చెప్పడం రాదు. ఐ లువ్ యు అని డ్రమాటిక్ గా చెప్పటం రాదు. పూలగుత్తి పంపించాలని అనిపించలేదు.
మర్నాడు మేమిద్దరమూ మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తున్నపుడు జెన్ని అద్రుష్టం గురించి మల్లీ చర్చ మొదలయ్యింది. లైఫ్ రొటీన్ అయిపోయింది అంటూ..ఏముంది నా లైఫ్ లో వర్క్, ఇల్లు తప్ప... ఒక ఎక్ష్చైట్మెంట్ లేదు. జెన్ని భర్త లాంటివాడు అయితే లైఫ్ ఎంత బాగుంటుందో అంటూ...నా వంక ఒక చూపు వేసి....మీకు అనిపించట్లేదా అలాగా అని అడిగింది. 
 నేను తనని నెమ్మదిగా అడిగా ప్రేమంటే పూలగుత్తి పంపించడమేనా అని. సర్రున కోపం వచ్చింది తనకి అలా ఎందుకు అంటున్నారు?  "ప్రేమ ఉంటే సరిపోదు. దానిని వ్యక్తపరచడం కూడా తెలియాలి అంటూ అవేశంతో జవాబు ఇచ్చింది." 
" నేను  నీతో ఏకీభవిస్తాను. కాని ప్రేమని ఇలా ( పూలగుత్తి లాంటివి ఇచ్చి) మాత్రమే వ్యక్తపరచాలని లేదు కదా ?  మీ వారు నీ మనసెరిగి మసలుకుంటారు కదా అది ప్రేమేగా?"  అంటే "లేదు. అయినా మీకు అర్ధం కాదు, మీ తరం వేరు..మా తరం వేరు" అని సమాధానం వదిలింది. నాకు నిజంగానే జాలి వేసింది తనని చూస్తే. ప్రేమని తరచు నాటకీయంగా వ్యక్త పరచటం లేదు అన్న వాదనే కాని, తన భర్త చేసే ప్రతి చర్యలోనూ ప్రేమని గ్రహించని తన అజ్ఞానాన్ని చూసి కోపం కూడా వచ్చింది. 
ఒక రెండు నెలల తర్వాత తాజా వార్త ..మా ఆఫీస్ లో జెన్ని భర్త జెన్ని కి విడాకులు ఇచ్చేసాడని.